గెలుపు లక్ష్యంతో.....తుది సన్నద్ధత


కొడాలి భవానీ శంకర్‌
రాష్ట్ర స్థాయి అత్యుత్తమ సర్వీసుల్లో  నియామకానికి రాసే పరీక్ష గ్రూప్‌-1... ఇప్పుడు ఐదు రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. శంకలూ, అపోహలూ విస్మరించి, ఏకాగ్రతతో ఈ  సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎలా అంటారా? ఏపీపీఎస్‌సీ పోటీపరీక్షల నిపుణుల సూచనలివిగో...!
ఆయుధాలు ఎంత అధునాతనమైనవి అయినా, ఉపయోగించే నైపుణ్యం ఎంత బాగా ఉన్నా యుద్ధక్షేత్రంలో వాటి వినియోగంపైనే విజయం ఆధారపడివుంటుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీలో కూడా పరీక్షా సమయంలో జ్ఞానం, ఏకాగ్రత మొదలైన అస్త్రాలను సమర్థంగా వినియోగించటంపైనే విజయం ఆధారపడుతుంది. మానసిక సంసిద్ధత చాలా ముఖ్యం
పరీక్ష తేదీకి కనీసం 3 రోజుల ముందు నుంచే 'నేను బాగా ప్రిపేరయ్యాను' అనుకోవాలి. చాలామంది అభ్యర్థులు పరీక్ష తేదీ సమీపిస్తున్నకొద్దీ 'ఇది చదవలేదు', 'అది చదవలేదు' 'టైమ్‌ చాల్లేదు' అంటూ నానా హైరానాకు గురవుతారు. ఇలాంటి గందరగోళం తీవ్ర నష్టానికి దారితీస్తుందని గుర్తించాలి. ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో కనీసం 18 గంటలకు ముందే ప్రిపరేషన్‌ను ఆపివేయాలని మానసిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా చేస్తే చదివిన సమాచారం ఒక క్రమ పద్ధతిలో పరీక్షా సమయంలో ప్రతిభావంతంగా వెలుగుచూస్తుంది.
భౌతిక సంసిద్ధత కూడా ప్రధానమే
హాల్‌ టికెట్‌, పెన్సిల్‌ ఇతరత్రా సామగ్రి కోసం చివర్లో వెతుకులాట తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. వీటన్నిటినీ సిద్ధపరచుకోవటంతో పాటు పరీక్షాకేంద్రం మీ సొంత ఊరు కాకపోతే ఆ ఊరికి ముందురోజే చేరుకోవటం మంచిది. చాలామంది అభ్యర్థులు పరీక్ష మరో అరగంటలో ఉందనగా పరీక్ష హాలు వెదుకులాటలో ఉంటారు. ఇలాంటి ఒత్తిడి వల్ల జరిగే నష్టం అంతా ఇంతా కాదు!
పరీక్ష హాలు, పరిసరాలు ప్రాముఖ్యం లేనివి
పరీక్ష హాలుకు చేరగానే వందలమంది అభ్యర్థులు కన్పిస్తారు. వీళ్ళంతా ప్రత్యర్థులే. మళ్ళీ ఒత్తిడి ఖాయం. పరీక్ష హాలు దగ్గరే కళ్ళు ఎర్రబడి, పుస్తకాలు తెగ చదివేస్తున్న అభ్యర్థులు కన్పిస్తారు. ఒత్తిడి మరింత పెరిగిపోతుంది.
పైగా కొంతమంది అభ్యర్థులు- వ్యవసాయ వృద్ధిరేటు ఎంత? 104వ రాజ్యాంగ సవరణ ఏమిటి? హర్షవర్థనుని మొదటి భార్య కొడుకు ఏ రంగంలో ప్రసిద్ధుడు?.. లాంటి బిట్ల గురించి తీవ్రంగా చర్చించుకుంటూ ఉంటారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రశ్నలకు సమాధానం మీకు తెలియదనుకోండీ, ఆకాశం మీద పడుతున్న భావన కలుగుతుంది.
పరీక్ష హాలుకి చేరగానే అపరిశుభ్ర వాతావరణం, చిన్న చిన్న బెంచీలూ, కుర్చీలూ... ఇలాంటివి మళ్ళీ అసంతృప్తికి కారణాలవుతాయి. 'గ్రూప్‌-1 రాసే అభ్యర్థికి ఇలాంటి సౌకర్యాలా కల్పించేది?' అంటూ ఆవేశానికి గురికావొద్దు.
పరీక్ష హాలు పరిసరాల్లో, హాలు లోపలా ఎదురవుతున్న పరిస్థితులు తాత్కాలికం. కానీ పరీక్ష ఫలితం శాశ్వతమని గుర్తుంచుకోవాలి. అక్కడ ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలని అనుకోవద్దు. దానికంటే పరీక్ష సరిగా రాయటం మీదే దృష్టి కేంద్రీకరించాలి.
ఎగ్జామినర్ల సూచనలు తప్పక పాటించాలి
పరీక్ష హాలు లోపలికి కనీసం 1 నిమిషాల ముందుగా చేరాలి. పరీక్ష ప్రారంభమయ్యాక వచ్చే అభ్యర్థులు ఎంత ఒత్తిడికి గురవుతుంటారో గమనిస్తే చేయకూడనిది ఏమిటో అర్థమైపోతుంది. ఎగ్జామినర్‌ చెప్పే సూచనలను తప్పకుండా అనుసరించి ప్రశ్నపత్రం ఇచ్చేంతవరకూ మౌనంగా కూర్చోవటం మీ శక్తిని పెంచుతుంది. కోడ్‌ దిద్దకో, హాల్‌ టికెట్‌ నంబర్‌ సరిగా దిద్దకో కనీసం 2-3 శాతం అభ్యర్థులు పరీక్ష జరక్కముందే బరిలో నుంచి వైదొలుగుతున్నారనే విషయం గుర్తించాలి.
పరీక్ష కేంద్రంలో అవాంతరాలు సహజమే
పరీక్ష జరుగుతున్న సమయంలో కూడా కొంతమంది కాపీ కొడుతూ ఉండొచ్చు. కొందరు బిట్లు చర్చించుకుంటూ జవాబులు నిర్ణయించుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలు తక్కువే. అయినా వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. సీరియస్‌ అభ్యర్థులు తమ సబ్జెక్టుపై ఆధారపడతారే కానీ ఇలాంటివాటికి ఆకర్షితులు కారు. ప్రశాంతంగా మీ సామర్థ్యాలను ప్రదర్శించండి.
ఆన్సరింగ్‌ విధానంలో హేతుబద్ధ పద్ధతి ఏది?
* జనరల్‌స్టడీస్‌ లోని తనకిష్టమైన విభాగానికి సంబంధించిన ప్రశ్నల నుంచి మొదలుపెట్టవచ్చు. లేకుంటే ప్రశ్నపత్రంలోని వరసనే పాటించవచ్చు.
* అన్ని విభాగాలకూ సమానమైన సమయం కేటాయించాలని కూడా అనుకోనక్కర్లేదు. కొన్ని విభాగాల్లో ప్రశ్నలు సాధారణ స్థాయిలో అడిగినపుడు జవాబులు చాలా త్వరగా వచ్చేస్తాయి. ఆదా అయిన సమయాన్ని 'మెంటల్‌ ఎబిలిటీ' లాంటి విభాగాలకు వెచ్చించవచ్చు.
* ఒకసారి ప్రశ్న కోసం కొంత సమయాన్ని వినియోగించినపుడు వీలైనంత వరకూ సమాధానం అప్పుడే గుర్తించేందుకు ప్రయత్నించటం మంచిది. కొంత సమయం వెచ్చించాక, ఒక రౌండు పూర్తయ్యాక ఈ ప్రశ్నను మళ్ళీ చూడొచ్చులే అని వాయిదా వేయటం అన్ని సందర్భాల్లో సరైనది కాదు.
* ప్రశ్నపత్రం సమాధానం గుర్తించటం, అన్నీ పూర్తయ్యాక చివరి పది నిమిషాల్లో సమాధానాలన్నీ ఆన్సరింగ్‌ షీటులో మార్కింగ్‌ చేద్దామనుకోవటం కూడా సముచితం కాదు. ఎప్పటి ప్రశ్నకు అప్పుడే ఆన్సర్‌ షీటులో సమాధానం గుర్తించటం వల్ల సరైన టైమ్‌ ప్లాన్‌ వస్తుంది.
* బాగా కఠినంగా ఉన్న ప్రశ్నలకు ప్రశ్నపత్రంలో ఏదైనా గుర్తు పెట్టుకుని, ఒక రౌండు పూర్తయ్యాక మళ్ళీ పరిశీలించవచ్చు.
* ఎంతో స్పష్టంగా తెలిస్తే తప్ప ఒకసారి ఇచ్చిన సమాధానం మార్చకూడదు. ఇదే ఎక్కువ సందర్భాల్లో సహేతుక నిర్ణయమవుతుందని పరిశోధనలు చెపుతున్నాయి.
* ప్రశ్నల కఠినత్వ స్థాయి అధికంగా ఉన్నా కంగారుపడకుండా తెలిసినవి ప్రశాంతంగా జవాబులు గుర్తించుకుంటూ వెళ్ళాలి. ఇటీవల జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పేపర్‌ విభిన్నంగా వచ్చినప్పటికీ విజయం సాధించినవారి వెనక ఈ మెలకువ ఉందని గ్రహించాలి. కఠినత్వం అందరికీ వర్తిస్తుందని గుర్తించి వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించండి.
* ప్రశ్ననూ, ఆప్షన్లనూ పూర్తిగా చదవటం వల్ల నిర్లక్ష్యంలో చేసే పొరపాట్లను తగ్గించుకోవచ్చు.
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిజానికి జులై 25న జరగవలసి ఉంది. కాబట్టి పేపర్‌ జూన్‌లోనే తయారై ఉంటుంది. అందుకే జూన్‌ వరకు మాత్రమే కరెంట్‌ అఫైర్స్‌ చూసుకుంటే సరిపోతుంది.
పరీక్ష హాలు పరిసరాల్లో, హాలు లోపలా ఎదురవుతున్న పరిస్థితులు తాత్కాలికం. కానీ పరీక్ష ఫలితం శాశ్వతమని గుర్తుంచు కోవాలి. అందుకే పరీక్ష సరిగా రాయటం మీదే దృష్టి కేంద్రీకరించాలి.
పునశ్చరణ ఈ తీరులో
ఎ.ఎం. రెడ్డి
కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌
ప్పటి నుంచో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పోటీలో తమ ప్రతిభను చాటుకునేందుకు వ్యవధి ఇంకా ఐదు రోజులే మిగిలివుంది. కాబట్టి సిలబస్‌ ప్రకారం ఇప్పటివరకూ చదివిన వివిధ పాఠ్యాంశాలను సంఘటితం (consolidate) చేసుకోవాల్సివుంది. అంతే కానీ, ఇప్పటివరకూ చదవని అంశాలను కొత్తగా చదవటానికి ప్రయత్నించవద్దు. అంతే కాదు; ఇప్పుడు మెయిన్స్‌ పరీక్ష గురించి కూడా ఆలోచించవద్దు! ప్రిలిమ్స్‌లోని ఒక్కో సబ్జెక్టును తీసుకుని, మీరు ఇంతకుముందే సిద్ధం చేసుకున్న మీ పర్సనల్‌ నోట్సును పునశ్చరణ (రివిజన్‌) చేసుకోండి. మీరు పర్సనల్‌ నోట్సును సిద్ధం చేసుకోకపోతే ఇంతకుముందు చదివిన పుస్తకాలను ప్రతి పేజీ తిప్పివేస్తూ ముఖ్యమైన విషయాలను త్వరితగతిలో (at a glance) మొత్తం సబ్జెక్టును ఒకసారి పునశ్చరణ చేసినట్లవుతుంది. ఆ విధంగా ప్రతిరోజూ ఒకటి లేదా రెండు సబ్జెక్టుల పునశ్చరణ చేయాల్సివుంటుంది.
వీలుంటే మీలాగా బాగా చదివిన మిత్రులతో సబ్జెక్టులోని ముఖ్యాంశాలను చర్చించుకుంటే వాటి లోతుపాతులు తెలుసుకోవచ్చు. ఈ సమయంలో అనవసర విషయాలను ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలను చర్చిస్తూ కాలం వృథా చేసుకోవద్దు.
ఈ ఐదు రోజులూ వార్తాపత్రికలకూ, టీవీ చానల్స్‌లోని మామూలు వార్తలకు దూరంగా ఉంటే మేలు. ప్రముఖ దినపత్రికల్లో సబ్జెక్టు నిపుణులు ఇచ్చే మోడల్‌పేపర్లను ఆన్సర్‌ చేస్తే ప్రయోజనకరం. అయితే వాటిలో మీకు వచ్చే మార్కులను చూసి, భయపడాల్సిన పనిలేదు. ఒక్కోసారి గ్రూప్‌-1 మోడల్‌ పేపర్‌ కదా అని ప్రశ్నలన్నిటినీ కఠినంగానో, పరోక్షంగా మెలితిప్పో (ట్విస్ట్‌) నిపుణులు ఇవ్వొచ్చు. పరీక్షలోని మొత్తం 150 ప్రశ్నలూ అదే రీతిలో, అదే స్థాయిలో ఉంటాయనుకుని కంగారు పడకూడదు.
సిలబస్‌ ప్రకారం ప్రామాణిక పుస్తకాలను చదివిన విద్యార్థులు పరీక్షలోని 150 ప్రశ్నలకు గానూ కనీసం 100 ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలుగుతారు. నిజానికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించడానికి ఆ మార్కులు చాలు. కాబట్టి ఇప్పుడు మీరు ఆ విధమైన ధైర్యంతో ముందుకు సాగాల్సివుంటుంది.
పరీక్షలోని ప్రశ్నల సరళి తెలుసుకునేందుకు వీలైనన్ని ప్రామాణిక మోడల్‌ పేపర్లు సాధించడం చాలా ఉపయోగకరం. పరీక్ష ముందు చేసే ఇలాంటి సాధన- పరీక్షలోని ప్రశ్నలను వేగంగా, క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.

ప్రతి సబ్జెక్టులో సబ్జెక్టు వర్తమాన ప్రాధాన్యానికి సంబంధించిన అంశాలపై మరోసారి దృష్టి సారించండి.
* ఉదాహరణకు 2010 సంవత్సరం 60వ గణతంత్ర సంవత్సరం కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం, భారత సుప్రీంకోర్టు మొదలైన రాజ్యాంగ సంస్థలు కూడా వజ్రోత్సవాలను నిర్వహించుకున్నాయి. కాబట్టి ఆ దిశలో- భారతదేశ మొట్టమొదటి ఎన్నికల కమిషనర్‌, సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి అనే అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. * భారతీయ రిజర్వ్‌ బ్యాంకు 2010 సంవత్సరాన్ని ప్లాటినం సంవత్సరంగా జరుపుకుంటోంది. కాబట్టి ఆర్‌బీఐపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి.
* భారతదేశ భూగోళశాస్త్రంలో ఇటీవల ప్రాజెక్టులు, వివాదాస్పదమైన గనులు, ఖనిజ వనరులపై ప్రశ్నలు ఉండొచ్చు.
* శాస్త్ర సాంకేతిక విషయానికొస్తే... వివిధ రంగాల్లో గత ఏడాది సాధించిన విజయాలపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి.
* చరిత్రకు సంబంధించి ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది.
* భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు 2010-2011 బడ్జెట్‌పై, ఇటీవల ప్రవేశపెట్టి అమలుచేస్తున్న వివిధ పథకాలపై ఉంటాయి. అదేవిధంగా 11వ పంచవర్ష ప్రణాళికపై కూడా ప్రశ్నలుంటాయి. కాబట్టి ఈ సమయంలో ఈ విధమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించండి.
ఈసారి దేశ జన గణనను దృష్టిలో పెట్టుకొని జనాభాపై తప్పకుండా ప్రశ్నలు ఉంటాయి. 2011 జనగణనలో నూతనంగా ప్రవేశపెట్టే అంశాలపై ప్రశ్నలు సంధిస్తారు. ఉదాహరణకు యూనిక్‌ ఐడెంటిటీ, జాతీయ జనాభా రిజిస్టర్‌ బయోమెట్రిక్‌ విధానం, ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జనగణన మొదలైన అంశాలను చూసుకోవలసి ఉంటుంది.
* అసలు సమస్య అంతా కరెంట్‌ అఫైర్స్‌పై ఉంది. ఎందుకంటే ఈ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిజానికి జులై 25న జరగవలసి ఉంది. కాబట్టి పేపర్‌ జూన్‌లోనే తయారై ఉంటుంది. అందుకే జూన్‌ వరకు మాత్రమే కరెంట్‌ అఫైర్స్‌ చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా 2010 జనవరి నుంచి జూన్‌ వరకు జరిగిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను చూడవలసి ఉంటుంది. ఉదాహరణకు నోబెల్‌ బహుమతులపై ప్రశ్న తప్పనిసరి. అది 2009 అక్టోబరు సంఘటనలపై ఆధారపడి ఉంటుందని గమనించండి.
పరీక్ష రోజుకు ముందు రాత్రి సాధ్యమైనంత వరకు త్వరగా నిద్రపోండి. అంతేకానీ, తెల్లవార్లూ మేల్కొని ఆఖరు గంట ప్రిపరేషన్‌ చేయవద్దు. ఎందుకంటే నిద్రలేమి వల్ల మీరు పరీక్ష హాలులో సరిగా ఆలోచించలేకపోవటంతో ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివి కచ్చితమైన సమాధానాలను గుర్తించటంలో ఇబ్బంది పడతారు.
ఈ పరీక్ష కోసం రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రిపరేషన్‌, పరీక్ష హాలులోని రెండు గంటల కాలానికి సమానమని మరవకూడదు. అందుకే పరీక్ష రోజు ఏ విధమైన ఒత్తిడికీ లోనుకావద్దు. పరీక్ష హాలులోని అభ్యర్థులను అప్పటికప్పుడు పరిచయం చేసుకోవడం గానీ, వారితో ప్రశ్నల సరళి గురించి చర్చించడం గానీ, వారి సమాధానాలను అడగడం గాని ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు. ఇది మీ విజయానికి అవరోధం. మీకు ఇచ్చిన ఓఎంఆర్‌ సమాధాన పత్రంలోని సమాచారాన్ని స్పష్టంగా, క్షుణ్ణంగా పూర్తి చేయండి. అక్కడ ఏమాత్రం పొరపాటు చేసినా మీరు ఇంతకాలం చేసిన శ్రమంతా వృథా అవుతుంది. ఎందుకంటే ఓఎంఆర్‌ షీట్‌లోని సమాచారం చాలా కీలకమైనదని మరవరాదు. దానిని తేలికగా తీసుకొని ఆదరాబాదరగా నింపకూడదు.
మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలకు వెంటనే సమాధానం తెలియకపోతే వాటిని వదిలేసి చివరకు ప్రయత్నించండి. నెగటివ్‌ మార్కులు లేవు కాబట్టి మీకు కచ్చితమైన సమాధానం తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్‌ పద్ధతిని ఉపయోగించి ప్రతి ప్రశ్నకూ సమాధానాన్ని గుర్తించండి.

2 comments: