తెలుగు వారి వేదం.....చింతలూరు ఆయుర్వేదం




చెదలుపట్టిన తాళపత్ర గ్రంథాలకూ, వైద్యశిఖామణుల అద్దాల అరలకూ పరిమితమైపోయిన ఆయుర్వేదాన్ని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత చింతలూరు వారిదే. ఇప్పుడా ఔషధాలు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అచ్చతెలుగు ఆయుర్వేద బ్రాండ్‌ 'వేంకటేశ్వర ఫార్మసీ' ఎనిమిదిన్నర దశాబ్దాల వ్యాపార ప్రస్థానమిది...
మంధరపర్వతం కవ్వమైంది. వాసుకి తాడైంది. క్షీరసాగర మథనం ప్రారంభమైంది. దేవతలొక పక్క, రాక్షసులొక పక్క... పోటీపడి చిలికారు.
చింతామణి వచ్చింది. కల్పవృక్షం వచ్చింది. చంద్రుడొచ్చాడు. శ్రీలక్ష్మి వచ్చింది. శంఖం, చక్రం, అమృతపాత్ర, ఆయుర్వేద శాస్త్రం తలోచేతా పట్టుకుని ధన్వంతరి ప్రత్యక్షమయ్యాడు. ఆయుర్వేద విజ్ఞాన సంపదని సవినయంగా స్వీకరించి దక్షప్రజాపతికి, ఇంద్రుడికి, అశ్వినీ దేవతలకు, మహర్షులకు అందించాడు బ్రహ్మదేవుడు. చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు తదితరులు తమతమ కాలాల్లో ప్రజలందరికీ పంచారు. కలియుగంలో ఆ బాధ్యత వేంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి అప్పగించారు.


* * *
మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు కేస్‌స్టడీగా అధ్యయనం చేయాల్సిన విజయగాథ ఇది. వ్యాపార విజయానికి కావలసిందేమిటి? పెట్టుబడా, నాణ్యతా, ప్రచారమా... ఎటూ తేల్చుకోలేని రేపటి పారిశ్రామిక వేత్తలకు వేంకటేశ్వర ఫార్మసీ ఓ స్పష్టతనిస్తుంది. దారి చూపుతుంది. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూళ్లో తయారైన మందులు డాబర్‌, బైద్యనాథ్‌ వంటి దిగ్గజాల్ని ఎలా ఢీకొంటున్నాయి? అలోపతిని తట్టుకుని ఎలా నిలబడుతున్నాయి? అంతర్జాతీయ మార్కెట్‌లో ఎలా దూసుకుపోతున్నాయి? అసలు, ఆ సంస్థ యూఎస్‌పీ (యునీక్‌ సెల్లింగ్‌ ప్రిపోజిషన్‌) ఏమిటి?
చింతలూరు ఫార్మసీ విజయం, నూటికి నూరుపాళ్లు భారతీయ మేనేజ్‌మెంట్‌ అద్భుతం.
* * *
ఉద్యోగమంటే, ఓ శాశ్వాత సమస్యకి తాత్కాలిక పరిష్కారం. ఆ ఆలోచనలు మనవి కాదు. ఆ లాభాలు మనవికావు. ఆ ఎదుగుదలా మనదికాదు. అదో జీవితకాల బానిసత్వం...రెండేళ్ల గుమస్తాగిరీ గొప్ప పాఠమే నేర్పింది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఉద్యోగానికి రాజీనామా చేశారు వెంకటేశ్వర్లు. అన్న పిచ్చయ్యగారితో కూడా చేయించారు. అప్పటిదాకా ఆ అన్నదమ్ములు పొదుపుచేసుకున్న వెుత్తమంతా లెక్కకడితే, అక్షరాలా నూటయాభైరూపాయలు. ఇద్దరూ చింతలూరికి ప్రయాణమయ్యారు. ఏం చేయాలన్నది సమస్యే కాదు. వంశానుగతంగా వస్తున్న వైద్యవృత్తి ఉండనే ఉంది. తండ్రి వెంకయ్యగారు చేయితిరిగిన వైద్యులు. ఆయన తండ్రి అపర ధన్వంతరి. ఆ వారసత్వ ప్రతిభ సోదరులకూ అబ్బింది. వెంకటేశ్వర్లు తండ్రి దగ్గర ఆయుర్వేదం అభ్యసించారు. ప్రాచీన గ్రంథాలు చదువుకున్నారు. మూలికల్ని గుర్తించడం తెలుసుకున్నారు. మందుల తయారీలో మెలకువలు గ్రహించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కొంత సమయాన్ని వైద్యానికి కేటాయించారు. ఆ అనుభవం ఇప్పుడు పనికొచ్చింది. కొద్దికాలంలోనే హస్తవాసి ఉన్న వైద్యుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన చేయిపడగానే, పక్షవాతం వచ్చినవారు కాలు కదిపారు. మాటపడిపోయినవారు నోరు మెదిపారు. పిల్లల మీద ఆశ వదులుకున్నవారికి సంతానభాగ్యం కలిగింది. ఆయన గురించి విన్న చుట్టుపక్కల గ్రామాల సంపన్నులు కుటుంబ వైద్యుడిగా చేసుకున్నారు. జమీందార్లు నజరానాలు పంపించారు. ఎక్కడెక్కడి నుంచో ఆహ్వానాలు అందేవి. క్షణం తీరికలేని జీవితమైపోయింది. నలభైమూడేళ్ల వయసులో స్వచ్ఛందంగా ఆ పరుగును ఆపేశారు వెంకటేశ్వర్లు. ఇక, ఔషధాల తయారీ మీదే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఆ లక్ష్యంతోనే, 1925లో వేంకటేశ్వర ఆయుర్వేద నిలయాన్ని స్థాపించారు. ఏ వ్యాపారానికైనా ప్రచారం ముఖ్యం. ఆ ఉత్పత్తి గురించి నలుగురికీ తెలియాలి. పదిమందీ మాట్లాడుకోవాలి. చింతలూరులో ఆయుర్వేద ఫార్మసీ ప్రారంభమైన సంగతి, మహా అయితే చుట్టుపక్కల గ్రామాలకు తెలుస్తుంది. రాష్ట్రమంతా మారువోగాలంటే ఏం చేయాలి? అప్పుడే వెంకటేశ్వర్లులోని వ్యాపారవేత్త బయటికొచ్చాడు. 'బ్రాండింగ్‌' పర్వం వెుదలైంది. వేలకొద్దీ కరపత్రాలు ముద్రించారు. మునసబుకరణాల పేరుతో గ్రామగ్రామానికీ పంపారు. క్యాలెండర్లు పంచారు. ప్రత్యేకంగా ప్రచారానికే ఓ కారు కొన్నారు. మద్రాసు నుంచి బరంపురం దాకా...చింతలూరు బండి చక్కర్లుకొట్టేది. పత్రికల్లో అడ్వర్త్టెజ్‌మెంట్లు ఇచ్చారు. దండోరా వేయించారు. గోడ ప్రకటనలు వెలిశాయి. ఆ రోజుల్లోనే ప్రచార బడ్జెట్‌ ఇరవైవేలు!


ఆ ప్రచారమంతా ఒక ఎత్తు, 'మృతవంధ్యా సంజీవని' ద్వారా వచ్చిన పేరు మరో ఎత్తు. పిల్లల మీద ఆశలు వదులుకున్న దంపతులకు సంతానభాగ్యం కలిగించింది ఆ ఔషధం. 'మా మందు వాడండి. సంతానం కలిగాకే రూ.116 ఇవ్వండి' అంటూ వెంకటేశ్వర్లు విడుదల చేసిన ప్రకటన పెద్ద సంచలనం. ఎంతోమంది తమ పిల్లలకు ఆయన పేరే పెట్టుకున్నారు. ఆయనతోనే అక్షరాభ్యాసం చేయించారు. ఆయనింట్లో రోజూ నూటపదహార్ల వర్షం కురిసేది. అప్పట్లో నూటపదహారు రూపాయలంటే, యాభై బస్తాల ధాన్యంతో సమానం! ఇంగ్లిష్‌ మందులు అప్పుడప్పుడే ప్రచారంలోకి వస్తున్నాయి. సంప్రదాయ వైద్యానికి ఆదరణ తగ్గిపోతోంది. మిడిమిడి జ్ఞానంతో కొంతమంది వైద్యానికే అప్రతిష్ఠ తెస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో సామాన్య ప్రజల్లో ఆయుర్వేదమంటే నమ్మకం కలిగించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యత వెంకటేశ్వర్లు తీసుకున్నారు. ఏ సమస్యకు ఏ మందు వాడాలో, ఎలా వాడాలో వివరిస్తూ సవివరమైన కేటలాగు ముద్రించారు. నాలుగువేల ప్రతులు రాష్ట్రమంతా పంపారు. తపాలా ద్వారా కూడా వైద్యం నడిచేది. వచ్చిన ఉత్తరాలన్నీ ఓపిగ్గా చదివి, స్వయంగా బదులిచ్చేవారు. మందుల్ని జాగ్రత్తగా పోస్టుచేసేవారు. ప్రారంభ సంవత్సరంలోనే ఆయుర్వేద నిలయం ఆరువేల రూపాయల టర్నోవరు సాధించింది. అది లక్షల రూపాయలకు చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. 1950-60లలో 'కుటుంబ రక్షణి' పేరుతో దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి రోజువారీ సమస్యలకు వాడదగిన పదిరకాల మందులను ఓ పెట్టెలోపెట్టి విక్రయించారు. జనం ఎగబడి కొన్నారు. చింతలూరు మందులు నిత్యావసరాల జాబితాలో చేరాయి. ఆయుర్వేద నిపుణులు కూడా సొంతంగా తయారుచేసుకోవడం మానేశారు. ఏ పరీక్షలూ అక్కర్లేదు. ఎవరైనా వెళ్లి కొనుక్కోవచ్చు. కేటలాగులో ఇచ్చిన పద్ధతి ప్రకారం వాడితే చాలు. ఎలాంటి దుష్పరిణామాలూ ఉండవు...అన్న భరోసా ఇవ్వగలిగారు. ఆ నమ్మకమే చింతలూరు ఫార్మసీకి శ్రీరామరక్ష.


అప్పుడే, వెంకటేశ్వర్లు తనయుడు సూర్యనారాయణమూర్తికి సంబంధాలు చూస్తున్నారు. ఓ శ్రీమంతుల కుటుంబం పిల్లనివ్వడానికి వచ్చింది. వచ్చేటప్పుడు సవాలక్ష సందేహాలు. సాధారణ ఆయుర్వేద వైద్యుల ఇంట్లో తమ బిడ్డ సుఖపడుతుందా అన్న అనుమానం. అయినా, ఓసారి అబ్బాయిని చూసొద్దామని బయల్దేరారు. కాఫీలూ టిఫిన్లూ అయ్యాయి. అంతలోనే పోస్ట్‌మాన్‌ వచ్చాడు. మనియార్డర్ల కట్ట వెంకటేశ్వర్లు చేతిలో పెట్టాడు. సంతకాలు చేయడానికే ఆయనకి పావుగంట పట్టింది. చేతిలో డబ్బు పెట్టేసి, వెళ్లిపోయాడు పోస్ట్‌మాన్‌. సంబంధం చూడటానికి వచ్చిన పెద్దమనిషి నోట మాటరాలేదు. ఒక్కరోజు సంపాదన నూటయాభై రూపాయలా, వోతుబరిగా పేరున్న తనకే అంతరాబడి లేదే! పెళ్లికూతురి తండ్రి అనుమానాలన్నీ తీరిపోయాయి. సంబంధం ఖాయంచేసుకుని, సంతోషంగా వెళ్లిపోయారు. ఎక్కడ ఆయుర్వేద సదస్సు జరిగినా, వెంకటేశ్వర్లు తనవంతు సహాయం చేసేవారు. నిధులు సమకూర్చేవారు. చక్రవర్తుల వేంకటశాస్త్రితో ధన్వంతరి శతకం రాయించారు. దీక్షితదాసుతో ధన్వంతరి హరికథ చెప్పించారు. మనదైన వైద్య విధానాన్ని జనంలోకి తీసుకెళ్లడమే ఆయన లక్ష్యం. ఆయుర్వేదాన్ని ప్రచారం చేయడమంటే, పరోక్షంగా తమ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవడం కూడా!
1949లో వెంకటేశ్వర్లు మరణంతో, సూర్యనారాయణమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలోనే ఆయుర్వేద నిలయం 'ప్రైవేట్‌ లిమిటెడ్‌'గా మారింది. సిబ్బంది సంఖ్య పెరిగింది. ప్రావిడెంట్‌ ఫండ్‌, గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు వచ్చిచేరాయి. ఆయుర్వేద నిలయం యాభై ఏళ్ల పండగ కూడా ఘనంగా జరిగింది. నారాయణమూర్తి ఆధునికీకరణకు ప్రాధాన్యమిచ్చారు. గిరాకీకి సరిపడా సరఫరా పెంచడానికి యంత్రాల్ని ఉపయోగించారు. అలా అని సంప్రదాయ పద్ధతుల్ని పూర్తిగా వదిలిపెట్టలేదు. పాతకొత్తల్ని మేళవించారు. టర్నోవరు లక్షల నుంచి కోట్లకు పెరిగింది. శ్రీరామమూర్తితో మూడోతరం నిర్వహణ వెుదలైంది. ఆయన నాయకత్వంలో టర్నోవరు పదహారు కోట్లకు చేరుకుంది. ఇందులో రెండు కోట్లు విదేశీ ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో చింతలూరు మందులకు మంచి గిరాకీ ఉంది. ఇటలీ నుంచి కూడా వ్యాపార ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రస్తుతం వేంకటేశ్వర ఫార్మసీకి 215 శాఖలున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో బలమైన పంపిణీ వ్యవస్థ ఉంది.
శ్రీరామమూర్తి ఆయుర్వేద వ్యాపారంలో కార్పొరేట్‌ వ్యూహాల్ని అమలుచేస్తున్నారు. ప్యాకింగ్‌లో, ప్రచారంలో సరికొత్త ధోరణులకు శ్రీకారం చుట్టారు. మార్కెటింగ్‌ సిబ్బందికి లక్ష్యాలు పెట్టారు. అన్ని విభాగాల్నీ కంప్యూటరీకరించారు. ఉద్యోగి-యజమాని సంబంధాల విషయంలో ఏ సంస్థ అయినా, ఆయుర్వేద నిలయాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. నలభై ఎనిమిదేళ్ల క్రితం చిన్న గుమస్తాగా చేరిన ఉమామహేశ్వర్లు ఇంకా... తనవంతు సేవలు అందిస్తూనే ఉన్నారు. సంస్థ ఆయన జీవితంలో ఓ భాగమైపోయింది. సిబ్బంది తమది కేవలం ఉద్యోగమనే అనుకోరు. దాన్నో బాధ్యతగా భావిస్తారు. యజమానులు సిబ్బందిని సిబ్బందిలా చూడరు. ఆత్మీయుల్లా ఆదరిస్తారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. పిల్లల పెళ్లిళ్లకు సంస్థ తనవంతు సాయం చేస్తుంది. అవసరమైతే వడ్డీలేని రుణాలు ఇస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఉద్యోగుల సంఖ్య కొంత తగ్గించాల్సి వచ్చినా, సంస్థను నమ్ముకున్నవారికి ఏదో ఒక రూపంలో ఉపాధి కల్పించారు.
టెక్నాలజీ మేళవింపు
నాణ్యత సాధించడానికి, ఉత్పత్తి పెంచడానికి...మిక్సింగ్‌ నుంచి ప్యాకింగ్‌ దాకా ప్రతిదశలోనూ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు నిర్వాహకులు. భారత ప్రభుత్వ అనుమతితో సొంతంగా రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ వింగ్‌ (ఆర్‌ అండ్‌ డీ) ఏర్పాటు చేసుకోవడం వెనకున్న లక్ష్యమూ అదే. ఆయుర్వేద నిలయంలో తయారయ్యే ఔషధాల నాణ్యతను ముందుగా ఇక్కడ పరీక్షిస్తారు. తర్వాతే మార్కెట్లో విడుదల చేస్తారు. రాష్ట్రంలో అత్యాధునిక హంగులతో మైక్రోబయాలజీ లేబొరేటరీ ఉన్న ఆయుర్వేద సంస్థ ఇదొక్కటే. గత ఏడాది వేదాశ్వ, వీకే4డయాకాన్‌ అనే ఔషధాలకు, ఈ ఏడాది హీవోలాక్స్‌కు పేటెంట్లు వచ్చాయి. 'ఆయుర్వేద రంగంలో ఇన్ని పేటెంట్లు సాధించిన సంస్థ మరొకటి లేదు. కాలేయ సంబంధ వ్యాధులకు ఓ మందును తయారుచేస్తున్నాం. మధుమేహ రోగులకు అత్యుత్తమ ప్రయోజనాన్ని అందించే ఔషధాన్ని రూపొందించాం. కీళ్లవ్యాధులను సమర్థంగా నియంత్రించగల మందూ సిద్ధంగా ఉంది. వీటినీ పేటెంట్‌ చేయబోతున్నాం. మరో నాలుగు మందులకు కూడా పేటెంట్ల కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నాం. మా పరిశోధన విభాగం ఆ పన్లో నిమగ్నమై ఉంది' అని చెబుతారు శ్రీరామమూర్తి. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ, లక్నోలోని నేషనల్‌ బొటానికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లతో పాటు, వివిధ పరిశోధన సంస్థలతో ఆయుర్వేద నిలయం ఒప్పందాలు చేసుకుంది.
అవే విలువలు
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయంలో ఔషధాల తయారీకి ఏటా 10 కిలోల బంగారం, 60 కిలోల వెండి, 70 కిలోల పగడాలు, 50 కిలోల మంచిముత్యాలు, 500 కిలోల పాదరసం వినియోగిస్తారు. సంస్థ తయారు చేసే దాదాపు 26 రకాల ఔషధాల్లో బంగారాన్ని కలుపుతారు.భారత ప్రభుత్వం 1965లో బంగారం మీద కంట్రోలు విధించింది. అప్పట్లో ఆయుర్వేద నిలయంవారు వివిధ ఔషధాల్లో ఏటా ఆరు కిలోలకు పైగా బంగారాన్ని వాడేవారు. కొనుగోలుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి రావడంలో కొంత ఆలస్యమైంది. దీంతో ఔషధాల్లో బంగారాన్ని కలపడం కుదరలేదు. దీనివల్ల ఔషధగుణంలో లోపం ఉండదు, కానీ పూర్తిస్థాయి సామర్ధ్యాన్ని చూపలేదు. ఆ సమయంలో 'బంగారం కలపని ఔషధం' అని అట్టమీద స్పష్టంగా ముద్రించేవారు. తయారీ వ్యయం తగ్గింది కాబట్టి, ఔషధాల ధరల్ని కూడా తగ్గించారు. ఆ తర్వాత ప్రత్యేక అనుమతి రావడంతో, తిరిగి బంగారం కలిపిన ఔషధాలు తయారు చేశారు. ఈ విశ్వసనీయతే ఎనిమిది దశాబ్దాలుగా సంస్థను కాపాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ పొందిన వెుట్టవెుదటి ఆయుర్వేద కంపెనీ కూడా ఇదే.
ఆయుర్వేద ఔషధాల్లో 'చ్యవనప్రాశ'కు చాలా గిరాకీ ఉంది. పేరున్న కంపెనీలన్నీ పోటీపడి ఉత్పత్తిచేస్తున్నాయి. చ్యవనప్రాశ తయారీ అంత సులభం కాదు. శ్రమతో కూడుకున్న వ్యవహారం. కొన్నిరకాల మూలికల కషాయాన్ని మరిగిస్తూ, అందులో మంచి పక్వానికి వచ్చిన ఉసిరిపళ్ల గుజ్జును ఒకే దఫాలో కాకుండా, నిర్ణీత వ్యవధుల్లో కలుపుతూ ఉడికించాలి. ఆ గుజ్జుకు నెయ్యి, పటికబెల్లం, తేనె వంటి పదార్థాలు జోడించి, పాకం చేయాలి. ఆ పాకానికి కొన్ని మూలికా చూర్ణాలు చేర్చాలి. 1998లో ఆంధ్ర విశ్వవిద్యాలయ రసాయనశాస్త్ర విభాగాధిపతి ఎస్‌.సోమేశ్వరరావు దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న చ్యవనప్రాశ లేహ్యాలను పరీక్షించారు. వాటన్నింట్లోకీ ఆయుర్వేద నిలయం తయారుచేసిందే శ్రేష్టంగా ఉందని గుర్తించారు. కొన్ని సంస్థలైతే ఇక్కడి నుంచే టోకుగా తీసుకెళ్లి, సొంతముద్రలు వేసుకున్న దాఖలాలూ ఉన్నాయి.
దేశీ వయాగ్రా పేరుతో చాలా ఆయుర్వేద కంపెనీలు లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల్ని విక్రయిస్తున్నాయి. రెచ్చగొట్టే ప్రకటనలతో ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం మాత్రం తన సంప్రదాయ మార్గాన్ని వీడలేదు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలకూ పోలేదు. నిజానికి ఆ సంస్థ సిద్ధమకరధ్వజం, పూర్ణచంద్రోదయం, వసంత కుసుమాకరం తదితర ఔషధాల తయారీలో ఎంతోపేరు తెచ్చుకుంది. వాటినే కొన్ని కంపెనీలు పేరుమార్చి, ప్యాకింగ్‌ మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి. బలహీనతలతో వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఆయుర్వేద నిలయానికి ఎప్పుడూ లేదు. కల్లో కూడా రాదు.
నాణ్యతకు పెద్దపీట
ఆయుర్వేద నిలయం ఎండీ శ్రీరామమూర్తి గదిలోకి అడుగుపెట్టగానే 'క్వాలిటీ ఫస్ట్‌.. లాస్ట్‌..ఫరెవర్‌' అన్న మాటలు కనిపిస్తాయి. ఆ సంస్థ విజయ రహస్యం కూడా అదే. ప్రాణం నిలిపే మందుల్నీ వాటి తయారీ విధానాల్నీ ప్రాణసమానంగా చూసుకోవాలన్నది వ్యవస్థాపకుల కాలం నుంచీ పాటిస్తున్న సూత్రం. ఆయుర్వేద నిలయం వారు తమకు అవసరమైన వనమూలికల్ని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులతో సాగు చేయిస్తారు. చింతలూరు చుట్టుపక్కల రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని మాదీఫలం, ఉసిరి వంటివాటిని పండిస్తారు. మూలికలు, రసాయనాలు సేకరించడానికి ముగ్గురు నిపుణులకు శిక్షణ ఇప్పించారు. అవసరమైతే కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హర్యానాలకు వెళ్లి నాణ్యమైన మూలికల్ని తీసుకొస్తారు. సంస్థ తయారు చేసే ఔషధాల్లో అతి ఖరీదైంది... మహాకనక సింధూరరసం. గ్రాము ధర రూ.921 పలికే ఈ మందును క్షయవ్యాధిగ్రస్థులకు సిఫార్సు చేస్తారు. ఆయుర్వేద నిలయం తయారుచేసే అన్ని ఉత్పత్తుల్లోనూ 'వసంత కుసుమాకరం' బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని మధుమేహ రోగులకు వాడతారు. వెుత్తం టర్నోవరులో దీని వాటా ఇరవై శాతానికి పైగానే ఉంటుంది.
వూరికి ఉపకారం
ఆయుర్వేద నిలయాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో చింతలూరు ఎలాంటి ప్రత్యేకతలూ లేని కుగ్రామం. సరైన దారిలేదు. పోస్టాఫీసు లేదు. కనీస సౌకర్యాలు లేవు. ఆపేరుతో ఓవూరు ఉందన్న సంగతి కూడా చాలామందికి తెలియదు. ఆ పల్లెకు ప్రపంచపటంలో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది వేంకటేశ్వర ఫార్మసీ. వెంకటేశ్వర్లు అయినా, ఆయన వారసులైనా సొంతూరి అభివృద్ధి విషయంలో తమ బాధ్యతను ఎప్పుడూ మరచిపోలేదు. చింతలూరుతోపాటు, చుట్టుపక్కల గ్రామాల వారికి ఉచితంగా వైద్యం చేస్తున్నారు. మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఆ కృతజ్ఞతతోనే చింతలూరు గ్రామస్థులు సూర్యనారాయణమూర్తిని పాతిక సంవత్సరాలపాటు ఏకగ్రీవంగా సర్పంచి పదవికి ఎన్నుకున్నారు. ఆ నమ్మకాన్ని ఆయనెప్పుడూ వమ్ము చేయలేదు. ఆయన హయాంలోనే సిమెంటు రోడ్లు వచ్చాయి. మురుగునీటి పారుదల వ్యవస్థ వచ్చింది. రక్షిత తాగునీరు అందుబాటులోకి వచ్చింది. సొంత ఖర్చులతో పనులు చేయించి, ఆ తర్వాత ఎప్పటికో బిల్లు పాసైతే డబ్బు తీసుకునేవారు. ఊరికి వచ్చే అధికారులందరికీ ఉచితంగా వైద్యం చేశారు. దీంతో వారు, ప్రత్యేక శ్రద్ధతో సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసేవారు. వెంకటేశ్వర్లు నిర్మించిన ధన్వంతరి ఆలయం వూరికే వన్నెతెచ్చింది. ధూపదీప నైవేద్యాలకు ఎనిమిది ఎకరాలు విరాళంగా రాసిచ్చారాయన. సర్పంచిగా పాతికేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా గ్రామస్థులంతా కలిసి సూర్యనారాయణమూర్తిని 'సర్దార్‌' బిరుదంతో సత్కరించారు. ఆలమూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ అభివృద్ధికి కూడా ఆయన తనవంతు సాయం అందించారు. ఒక్క చింతలూరే కాదు, మారుమూల గ్రామాలకు కూడా ఆయుర్వేదం అందాలన్నది ఆ కుటుంబం కోరిక. తొలిదశలో, కరీంనగర్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నారు.
'అందరికీ ఆయుర్వేదం
ఆయుర్వేదంతో ఆరోగ్యం'...
ఇదే చింతలూరు ఫార్మసీ నినాదం.



పెద్దల బాటలో...
- ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి, ఎండీ వేంకటేశ్వర ఫార్మసీ, చింతలూరు.
యుర్వేదం మా రక్తంలో ఉంది. రోగాల గురించీ చికిత్సా విధానాల గురించీ నాన్నగారు నాకెన్నో మెలకువలు నేర్పించారు. వైద్యవిద్వాన్‌ పరీక్షలో పట్టా తీసుకున్నాను. వాణిజ్యశాస్త్రం చదవడంవల్ల ఆంగ్లంతో పరిచయం ఏర్పడింది. అకౌంటెన్సీ విధానాలు, మార్కెటింగ్‌ వ్యూహాలు వగైరా వ్యాపార సూత్రాలు ఒంటబట్టాయి.
శాస్త్రీయత, స్వచ్ఛత, నాణ్యత... మూడుతరాల మా విజయసూత్రాలు. ఆ విషయంలో ఇసుమంతైనా రాజీలేదు.
ఆయుర్వేదాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలతోపాటు, ప్రభుత్వానిదీ. ఎన్నో అమూల్యమైన గ్రంథాలు మట్టికొట్టుకుపోతున్నాయి. వాటిని కాపాడుకోవాలి. ముద్రించి ప్రజల మధ్యకు తీసుకురావాలి. ఆయుర్వేద మందుల్లో వాడే బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాలకు పన్నుల్లో మినహాయింపునివ్వాలి. ఆయుర్వేద ఔషధ పరిశ్రమ తరపున ప్రభుత్వానికి ఇది నా విజ్ఞప్తి.

పురస్కారాలు
వేంకటేశ్వర ఆయుర్వేద నిలయం అందుకున్న సత్కార పురస్కారాల జాబితా చాలా పెద్దది. మద్రాసు తెలుగు అకాడమీ 1991, 2002 సంవత్సరాల్లో ఆయుర్వేద నిలయం యాజమాన్యాన్ని ఘనంగా సత్కరించింది. ఉత్తమ సాంకేతిక అభివృద్ధి, పరిశోధనలకుగాను ఫ్యాప్సీ ఎక్సలెన్స్‌ అవార్డు వరించింది. ఏడాది కాలంలో రెండు పేటెంట్లు సాధించినందుకు, 2009లో ఫార్మాఎక్సెల్‌ పేటెంట్‌ అవార్డును ప్రకటించారు. నూతన ఉత్పత్తులు, సేవారంగాల్లో ఫ్యాప్సీ సిల్వర్‌ ట్రోఫీని అందుకుందీ సంస్థ. రాష్ట్రంలో జీఎంపీ (గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడక్ట్‌) అవార్డు పొందిన వెుట్టవెుదటి ఆయుర్వేద సంస్థ కూడా ఇదే. ప్రతిష్ఠాత్మకమైన భారత ఆయుర్వేద ఫార్మాకూపియా కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తొలిసారి సభ్యత్వం పొందిన ఘనతా చింతలూరు ఫార్మసీదే.

అభిమాన సంఘాలు
'చెళ్లపిళ్ల వేంకన గురువనుచు చెప్పుకొనంగ నొకగొప్ప ఆంధ్రదేశమునన్‌'... అనిపించుకున్న మహానుభావుడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. అవధాన దండయాత్రలకు బయల్దేరినప్పుడు...ఆయన వెంట, జంటగా తిరుపతి కవితోపాటు చింతలూరు మందులూ ఉండాల్సిందే. 'ఎప్పుడూ నూటపదహార్లు అందుకోవడమే తప్పించి, ఇవ్వడం తెలియదు. నా జీవితంలో తొలిసారిగా, చింతలూరు ఫార్మసీవారికి ఇచ్చాను' అని సరదాగా చెప్పేవారట చెళ్లపిళ్లవారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కుమారుడికి చింతలూరు మందులే స్వస్థతనిచ్చాయి. 'రామాయణ కల్పవృక్షం' రచయిత విశ్వనాథ దృష్టిలో చింతలూరు మందుల్ని మించిన ఆరోగ్య కల్పవృక్షం లేదు. 'ఇదిగో సెక్రెట్రీ, ఓరోజు దగ్గనీ ఓ రోజు జలుబనీ నాకు సినిమా స్టోరీలు వినిపించొద్దు. హాయిగా చింతలూరు మందులు వాడవయ్యా! నాలాగా... నిక్షేపంగా ఉంటావు' అంటూ సెటైరు జోడించి మరీ సలహా ఇచ్చేవారట 'ముత్యాలముగ్గు' రావుగోపాల్రావు. మహానటుడు నందమూరి తారకరామారావు అరవైలలోనూ అంత ఉత్సాహంగా కనిపించడానికీ, మహా వర్ఛస్సుతో వెలిగిపోడానికీ చింతలూరు మందులూ ఓ కారణమే. ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఈ మందులే వాడతారట. టాలీవుడ్‌లోనూ వాటికి ఆదరణ ఉంది. కృష్ణ, మహేశ్‌బాబు, త్రిష... చింతలూరు అభిమాన సంఘం సభ్యులే.
                                                                                      - పునుకొల్లు మృత్యుంజయకుమార్

No comments:

Post a Comment