గ్రూప్ II సక్సెస్ ప్లాన్

పేపర్-1

జనరల్ స్టడీస్
ప్రశ్నలు: 150 మార్కులు: 150
సమయం: రెండున్నర గంటలు

ప్రశ్నలడిగే విభాగాలు: హిస్టరీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ.
జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమకాలీన అవగాహన, సిలబస్‌లో పేర్కొన్న విభాగాలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే 150 మార్కులకుగాను 120కుపైగా సొంతం చేసుకునే అవకాశం ఈ పేపర్‌లో లభిస్తుంది.

ఈ క్రమంలో అభ్యర్థులు విభాగాల వారీగా నిర్దిష్ట టైం మేనేజ్‌మెంట్‌తో ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. విశ్లేషించి.. ఆయా విభాగాలకు లభించిన వెయిటేజీ ఆధారంగా సమయం కేటాయించడం మంచిది.

విభాగాల వారీగా ప్రిపరేషన్ టిప్స్.. 

గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఇటీవల కాలంలో ప్రాధాన్యం పెరుగుతున్న విభాగం జనరల్ సైన్స్ అనేది నిస్సందేహం. ముఖ్యంగా సిలబస్‌లో మార్పుల తర్వాత జనరల్ సైన్స్ కీలకంగా మారింది. దాదాపు 30 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఈ సబ్జెక్టును మూడు భాగాలు (ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ)గా విభజించి ప్రిపరేషన్ సాగించాలి.

ఫిజికల్ సైన్స్‌కు సంబంధించి ప్రాథమిక అంశాలైన ధ్వని, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్తు, ఉష్ణం, యాంత్రికశాస్త్రం, ద్విపదార్థాలు, గ్రహాలు, ఆధునిక భౌతికశాస్త్రంపై అవగాహన సాధించాలి.

కేవలం కోర్ సబ్జెక్టుకే పరిమితం కాకుండా దానికి సంబంధించి సమకాలీన పరిణామాలపై (శాస్త్రవేత్తలు- ఆవిష్కరణలు, ప్రయోగాలు తదితర) పట్టు కూడా ఎంతో ప్రధానం

ఇటీవల కాలంలో మన అంతరిక్ష విభాగం, రక్షణ శాఖలు పలు ప్రయోగాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. అందువల్ల అంతరిక్ష రంగానికి సంబంధించి ఈ తాజా ఉపగ్రహ ప్రయోగాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకోవాలి. (ఉదా: తాజాగా ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ16 ఉద్దేశం? ప్రయోగించిన ఉపగ్రహాలు- వాటి లక్ష్యం తదితర అంశాలు).

సంబంధిత నేపథ్యం (ఉదా: పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో చేపట్టిన ప్రయోగాలు- విజయాలు, వైఫల్యాలు) గురించి అవగాహన కూడా లాభిస్తుంది. దీంతోపాటు మన అంతరిక్ష రంగంలో ప్రముఖ ఘట్టాలపై పట్టు ఉండాలి.
ఇక రక్షణ రంగానికి సంబంధించి తాజా క్షిపణి ప్రయోగాలు- వాటి లక్ష్యాలు, పనితీరు, సామర్థ్యం తదితర అంశాలపై పట్టు సాధించాలి.

జనరల్ సైన్స్‌కు సంబంధించి కోర్ సబ్జెక్టయిన బయాలజీ నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో జీవులు- వర్గీకరణ; మానవ శరీరం- వివిధ వ్యవస్థలు; వ్యాధులు- వ్యాక్సీన్‌ల సమాచారం సొంతం చేసుకోవాలి.

పలు వ్యాధులు- వాటి విరుగుడుకు చేపడుతున్న ప్రయోగాలు- ఆవిష్కరించిన వ్యాక్సీన్ల గురించి సమకాలీన సమాచారాన్ని ఔపోసన పట్టాలి.

మొదటి పేపర్‌లో సాధ్యమైనంత ఎక్కువ మార్కులు సొంతం చేసుకునేందుకు మార్గం వేసే విభాగం హిస్టరీ. దాదాపు 20కు పైగా ప్రశ్నలు అడిగే అవకాశాలుంటాయి.

భారతదేశ చరిత్రకు సంబంధించి మూడు యుగాలు (ప్రాచీన, మధ్య, ఆధునిక)కు సమ ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ సాగించాలి.

పేపర్-2లోని మొదటి సెక్షన్ పూర్తిగా హిస్టరీకి సంబంధించిందే. కాబట్టి దానికోసం ప్రిపరేషన్ సాగిస్తూ పేపర్-1లోని హిస్టరీకి కూడా సన్నద్ధం కావచ్చు. ఈ విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

హిస్టరీలో అడిగే ప్రశ్నల సరళి కూడా మారుతోంది. కాబట్టి ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహన సొంతం చేసుకోవాలి.

కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి పరీక్ష తేదీకి ముందు సంవత్సర కాలంలో నమోదైన తాజా పరిణామాలపై సమాచారాన్ని సేకరించుకోవాలి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల ఎన్నికలు-విజేతలు-కొత్త ముఖ్యమంత్రుల డేటా అవసరం.

కరెంట్ అఫైర్స్ ప్రశ్నల సరళి కూడా మారుతోంది కాబట్టి.. సదరు సంఘటన నేపథ్యాలను, కూడా తెలుసుకోవాలి.
ఉదా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎన్నేళ్ల తర్వాత లెఫ్ట్ పాలన అంతరించింది. తాజా సంఘటనలను ముడిపెడుతూ నేపథ్యాలపై ప్రశ్నలు అడుగుతారు.

జనాభా గణన పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించి గణాంకాలపై పట్టు సాధించాలి.

పేపర్-1లో మరో ముఖ్య అంశం మెంటల్ ఎబిలిటీ. ఈ విభాగం నుంచి దాదాపు 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో నంబర్ సిరీస్; కోడింగ్ - డీ కోడింగ్; సీటింగ్ అరేంజ్‌మెంట్; ర్యాంకులు- అమరిక; అక్షరాలు- అక్షర క్రమంలో వాటి స్థానాలు; జంబుల్డ్ సెంటెన్సెస్ 1-100 వరకు ప్రధాన సంఖ్యలు; స్క్వేర్ రూట్; క్యూబ్ రూట్‌లు; వెన్ డయాగ్రమ్స్; నంబర్, వర్డ్ ఎనాలజీ; దిక్కులు; రక్త సంబంధాలు; కాలం-దూరం; పని-కాలం; లాభం - నష్టం; శాతాలు; సగటులు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.

స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నల కోసం విశ్లేషణ సామర్థ్యం పెంచుకోవాలి. జాగ్రఫీ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. దీనికోసం అభ్యర్థులు తప్పనిసరిగా అట్లాస్‌పై అవగాహన పొందాలి.

ఖనిజాలు-ప్రాంతాలు; నిర్దేశిత ఖనిజ ఉత్పత్తిలో భారత స్థానం; నదులు-పరీవాహక ప్రాంతాలు; అత్యంత ఎత్తై- అత్యంత లోతైన ప్రాంతాలు; సముద్రాలు- సరిహద్దు దేశాలు; తదితర అంశాల సమాచారం సేకరించాలి

నగరీకరణ; జనాభా - భిన్న జాతులు- ఆ జాతులు కేంద్రీకృతమైన ప్రాంతాలు; తదితర అంశాలపై నోట్స్ రాసుకోవాలి

ఎకనామికల్ జాగ్రఫీలో.. ఇరిగేషన్ ప్రాజెక్టులు - వాటి లక్ష్యాలు - సాగు విస్తీర్ణం; ప్రధాన పంటలు - అవి పండే ప్రాంతాలు- పంట విస్తీర్ణం; సాగు దిగుబడి వంటి విషయాలపై గణాంక సహిత సమాచారం ఉపయుక్తం.

రిఫరెన్స్ బుక్స్ 

పేపర్ -1 కోసం 
ఎన్.సి.ఇ. ఆర్.టి. బుక్స్. 
టెన్త్, ఇంటర్ మొదటి సంవత్సరం హిస్టరీ పుస్తకాలు
స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పుస్తకాలు
ఇంగ్లీషు మీడియం అభ్యర్థులు... యూపీఎస్సీ జనరల్ స్టడీస్ హిస్టరీ పార్ట్
ఇండియా ఇయర్ బుక్, యోజన, అట్లాస్
ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భౌగోళిక శాస్త్రం - తెలుగు అకాడెమీ
హిస్టరీ
ఆంధ్రుల చరిత్ర - బీఎస్‌ఎల్ హనుమంతరావు
ఆంధ్రుల చరిత్ర- పి. రఘునాథరావు 
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పుస్తకాలు
ఎన్.సి.ఇ. ఆర్.టి. బుక్స్. టెన్త్, ఇంటర్ మొదటి సంవత్సరం హిస్టరీ పుస్తకాలు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పుస్తకాలు
ఎకానమీ రిఫరెన్స్ బుక్స్
ఇండియన్ ఎకానమీ- మిశ్రా అండ్ పూరి
ఇండియన్ ఎకానమీ- అగర్వాల్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడెమీ
భారత ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడెమీ
50 ఇయర్స్ ఆఫ్ ఏపీ ఎకానమీ - హనుమంతరావు.
సైన్స్ అండ్ టెక్నాలజీ:
వివేక్ మాసపత్రిక, తెలుగు యోజన 
మెంటల్ ఎబిలిటీ: 
Quantitative Aptitude ... R.S. Aggarwal
Quicker Maths.. M.Tyra, Maths 30 days
Mental ability and Quantitative Aptitude Edgar Thrope

జనరల్ టిప్స్ 

ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ విధానంలో సాగించాలి. చదువుతూ ముఖ్యాంశాలతో యూనిట్లు, సబ్జెక్టుల వారీగా సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. పాక్టీస్ బిట్స్ ఆన్సర్ చేయాలి.

ఇప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టిన వారు నిర్దేశిత సిలబస్‌పై పూర్తిగా అవగాహన పొందాలి.

గత ప్రశ్న పత్రాలను పరిశీలించి ఆయా అంశాలకు ఉన్న ప్రాధాన్యం ఆధారంగా ప్రిపరేషన్‌లో తగిన సమయం కేటాయించాలి.

అయిదు నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో రోజుకు కనీసం పది గంటల ప్రిపరేషన్ సాగించాలి.

పరీక్షకు 15 రోజుల ముందు నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు.

లోపాలు ఉన్న అంశాలను మళ్లీ రివిజన్ చేయాలి.

గ్రాండ్ మోడల్ టెస్ట్‌లలో 90 నుంచి 95 శాతం స్కోర్ వచ్చేవరకు ప్రాక్టీసు- రివిజన్‌లను కొనసాగించాలి.

ఒకే అంశంపై అనేక పుస్తకాలు, మ్యాగజీన్లు, మెటీరియల్స్ కోసం విలువైన సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఏదో ఒక ప్రామాణిక సోర్స్‌కే పరిమితం కావాలి.





స్కోరింగ్‌కు ఆస్కారం.. పేపర్ 2

సెక్షన్-1 - ఏపీ హిస్టరీ
సెక్షన్-2 - భారత రాజ్యాంగం
ప్రశ్నలు: 150 మార్కులు: 150
సమయం: రెండున్నర గంటలు

ఈ పేపర్‌లోని మొదటి సెక్షన్ ఏపీ హిస్టరీ. మొత్తం 75 ప్రశ్నలు అడుగుతారు. ఇతర విభాగాలతో పోల్చితే కొంచెం ఎక్కువ మార్కులు సొంతం చేసుకోగల విభాగమిది. అంతేకాకుండా నిర్దేశిత సిలబస్ పరిధి తక్కువ కావడం కచ్చితంగా లాభించే అంశం.

పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను విశ్లేషణాత్మక కోణంలో సాగించాలి. డిస్క్రిప్టివ్‌గా చదివిన అంశాల నుంచి బిట్స్ రూపొందించుకోవాలి.
ఒక అంశం చదవడం పూర్తయ్యాక దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్ రాసి విశ్లేషణ చేసుకోవాలి.

ఇక సిలబస్‌ను మూడు విభాగాలుగా చేసుకుని చదివితే అర్థవంతంగా ఉంటుంది. పోటీ పరీక్షలో ప్రతి మార్కు కీలకమే. కాబట్టి ఏ అంశాన్ని కూడా విస్మరించకూడదు.

ఏపీ హిస్టరీకి తొలి అంకమైన శాతవాహనులపై బాగా పట్టు సాధిస్తే సిలబస్‌లోని తర్వాత అంశాలకు చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. అంతేకాకుండా ప్రశ్న పత్రంలో కూడా శాతవాహనులకు సంబంధించి ఎక్కువ వెయిటేజీ లభిస్తోందని చెప్పవచ్చు.

సెక్షన్-2 భారత రాజ్యాంగం:

కోర్ సబ్జెక్టుపై అవగాహన, సమకాలీన పరిణామాలపై పట్టు అవసరమైన విభాగం భారత రాజ్యాంగం.

రాజ్యాంగ ప్రకరణలకు సంబంధించి తాజా సవరణలపై సమాచారాన్ని సొంతం చేసుకోవాలి.

ఇక ప్రిపరేషన్ క్రమంలో.. భారత రాజ్యాంగంలోని ముఖ్య లక్షణాలు; ప్రవేశిక; ప్రాథమిక విధులు- హక్కులు; ఆదేశిక సూత్రాలు; భారత సమాఖ్య- విశిష్ట లక్షణాలు; కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన; శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల పాత్రలపై లోతుగా అధ్యయనం చేయాలి.

ఇలా చదివేటప్పుడు సిలబస్ ప్రకారం ముందుకు సాగాలి. విస్తృత మెటీరియల్‌లో ఉండే అంశాలన్నిటినీ చదవడం కంటే సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై బాగా పట్టు సాధించడానికి కృషి చేయాలి.

రాజ్యాంగ సవరణలకు సంబంధించి (73, 74 సవరణలు, పంచాయతీరాజ్ వ్యవస్థ) గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.

వీటితోపాటు ఆయా సవరణలు- వాటి ప్రాముఖ్యత- తేదీలు ఔపోసన పట్టాలి.

రాజ్యాంగ పర సంస్థల గురించి.. అంటే యూపీఎస్‌సీ; జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు; జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లు; మైనార్టీ కమిషన్; - వాటి కూర్పు విధానం; కాల వ్యవధి; ప్రస్తుత అధ్యక్షుల గురించి సమాచారం పొందాలి.

శాసన వ్యవస్థలు- జవాబుదారీతనం; సంక్షోభాలు- సంబంధిత రాజనీతి సిద్ధాంతాలపై పట్టు ఉండాలి.

పాలిటీ ప్రశ్నల సరళి కోసం ఏపీపీఎస్‌సీ గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి.

దీంతోపాటు యూపీఎస్‌సీ సివిల్స్ ప్రిలిమ్స్ ప్రీవియస్ కొశ్చన్స్‌ను పరిశీలించడం కూడా లాభిస్తుంది.

పాలిటీలో ప్రాథమిక అవగాహన కోసం తొలుత ఎన్‌సీఈఆర్‌టీ 8-12వ తరగతి సివిక్స్, పొలిటికల్ సైన్స్ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.

ఇటీవల ఆమోదించిన బిల్లులకు సంబంధించి సమాచారం కూడా అవసరమే.

గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఎవరనే అవగాహన కూడా ఉండాలి.

పరిపాలన వ్యవస్థకు సంబంధించి (కలెక్టర్లు - విధులు; ప్రభుత్వ శాఖలు తదితర) సమాచారం కూడా తెలుసుకోవాలి.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం; కారణాలపై విశ్లేషణ చేయాలి. 



















No comments:

Post a Comment