సమీకరణే సగం విజయం గురూ....

సమీకరణే సగం విజయం
కొడాలి భవానీ శంకర్‌
యుద్ధంలో గెలవాలంటే సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలి. దానికంటే ముందు సరైన ఆయుధాల ఎంపిక తప్పనిసరి కదా! గ్రూప్స్‌ పరీక్షల పోటీలో ప్రామాణిక మెటీరియల్‌నుసమీకరించుకోవటమూ అలాంటిదే! లక్ష్యానికి అనుగుణంగా విషయసేకరణ ఉండాలి. ఆ పునాదిపైనే అభ్యర్థి అవగాహనా, విశ్లేషణలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే అభ్యర్థుల కృషి ఫలిస్తుంది!
గ్రూప్‌-1, 2 పరీక్షల కొత్త సిలబస్‌కు తగిన మెటీరియల్‌ లభ్యం కాక అభ్యర్థులు తికమక పడుతున్నారు. మెటీరియల్‌ను సమర్థంగా సమీకరించుకోగలిగితే సగం విజయం సాధించినట్లే! కాబట్టి ఈ అంశంపై అభ్యర్థులు శ్రద్ధ చూపాల్సి ఉంది.  త్రికోణాలు
అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్‌ను మూడు కోణాల్లో సేకరించుకోవాలి.
1. ప్రాథమిక సమాచారం
పోటీ పరీక్షల్లో దాదాపు 50 శాతం బిట్ల వరకూ ప్రాథమిక (బేసిక్‌) సమాచారంపైనే ఆధారపడివుంటాయి. అందుకే ప్రతి పేపర్‌లోని ప్రతి సబ్జెక్టుపైనా ప్రాథమిక సమాచారం సేకరించుకోవాలి. సొంత నోట్సు వీలైనంతవరకూ రాసుకోవాలి. సమయం లేదనుకుంటే ప్రాథమిక సమాచారం కోసం ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకోవాలి.
సేకరించే ప్రాథమిక సమాచారంపైనే అభ్యర్థి అవగాహనస్థాయి, విశ్లేషణ శక్తులు ఏర్పడతాయి. దాన్నిబట్టే ఉన్నతస్థాయి, వర్తమాన విషయాల్లో సంబంధమున్న ఆయా సబ్జెక్టులను అర్థం చేసుకోగలుగుతారు.
2. ఉన్నతస్థాయి విషయాలు
సబ్జెక్టుపై ప్రాథమికంగా మెటీరియల్‌ సేకరించాక అదే సబ్జెక్టుపై ఉన్నతస్థాయి (అడ్వాన్స్‌డ్‌) విషయాలపై దృష్టి నిలపాలి. ఇందుకోసం పీజీ పుస్తకాలనూ, ప్రామాణిక పుస్తకాలనూ ఆశ్రయించాలి. ఉన్నతస్థాయి అంశాలపై 30 శాతం వరకూ ప్రశ్నలు వస్తుంటాయి. అందుకని అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ అంశాలు చదవక్కర్లేదు. పరీక్ష అవసరాలను బట్టి సమయం కేటాయించుకోవాలి.
3. ‘వర్తమాన’ సంధానం
ఒక విషయానికి సంబంధించి ఉన్నతస్థాయి మెటీరియల్‌ కూడా రూపొందించుకున్నాక ఆయా అంశాలతో సంబంధమున్న వర్తమాన అంశాలు (కరంట్‌ అఫైర్స్‌) ఏమున్నాయో గమనించి, నోట్సు తయారుచేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కరంట్‌ అఫైర్స్‌తో పాటు సబ్జెక్టు మెటీరియల్‌ను కూడా సమర్థంగా రూపొందించుకున్నట్లు అవుతుంది.
ఇలా చేస్తే మేలు
* జీకే ప్రిపరేషన్‌
ఇటీవల ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో జనరల్‌ నాలెడ్జ్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల గ్రూప్స్‌ అభ్యర్థులు ఇయర్‌బుక్స్‌ను అధ్యయనం చేయటం అవసరం.
* ఏపీ ఎకానమీ
అభ్యర్థులు ఈ సబ్జెక్టు మెటీరియల్‌ కోసం బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ఎకానమీ నోట్సు తయారీకి 1) ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి-ఆర్థిక సంస్కరణల సవాళ్ళు (ప్రజాశక్తి ప్రచురణ) 2) ‘ఈనాడు’, ‘హిందూ’ పత్రికల కథనాలు ఉపయోగపడతాయి.
* కరంట్‌ అఫైర్స్‌
పరీక్ష తేదీకి 6 నెలల ముందటి సంఘటనలపై ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల విభజన చేసుకోవాలి. ప్రతి అంశంలోనూ సాంఘిక, రాజకీయ, సాంకేతిక, క్రీడారంగాలు; అవార్డులు; నూతన అన్వేషణలు అనే కోణాల్లో ఎప్పటికప్పుడు సొంతనోట్సు తయారుచేసుకోవాలి. దినపత్రికలతో పాటు పోటీ పరీక్షల మ్యాగజీన్లను పరిశీలిస్తుండాలి.
చిక్కులు… పరిష్కారాలు
1. గ్రూప్‌-1, 2లకు ప్రత్యేకంగా మెటీరియల్‌ తయారుచేసుకోవాలా?
*గ్రూప్‌-2 మెటీరియల్‌ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు కూడా సరిపోతుంది. పైగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ క్వాలిఫైయింగ్‌ పరీక్ష కాబట్టి పెద్దగా ఆందోళనేమీ లేకుండా అదే మెటీరియల్‌ను వాడుకోవచ్చు.
గ్రూప్‌-1 మెయిన్స్‌లో పేపర్‌-2,3 ల్లోని అంశాలకూ గ్రూప్‌-2లోని పేపర్‌-2,3 అంశాలకూ సారూప్యతలున్నాయి. వాటిని అనుసంధానం చేసుకొని మెటీరియల్‌ రూపొందించుకోవచ్చు.
2. గ్రూప్స్‌ రెంటికీ మెటీరియల్‌ రూపకల్పనలో ఒకే పంథా సరిపోతుందా?
*గ్రూప్‌-2 మెటీరియల్‌ తయారీలో సమగ్రతకూ, సూక్ష్మతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్‌-1లో అంశాలవారీగా కీలక ప్రశ్నలను ఊహించుకొని మెటీరియల్‌ తయారుచేసుకోవాలి.
3. తాజా గణాంకాల సమాచారం తెలుసుకోవటం ఎలా?
*ఈ సమస్య ఆర్థిక అంశాల్లో ప్రధానంగా ఉంది. 2007-08 ఎకనమిక్‌ సర్వే, 2008-09 బడ్జెట్‌ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత ఆర్థికవ్యవస్థ సమాచారం 2005-06, 2006-07 వరకూ లభిస్తోంది. మనరాష్ట్ర ఆర్థికాంశాలే సమస్య. 2004-05, 2005-06 ఆర్థిక గణాంకాలపై ఆధారపడితే సరిపోయే అవకాశాలున్నాయి.
4. సొంతనోట్సు తయారీకి సమయం లేదు. ఎలా?
*ఇలాంటప్పుడు ప్రామాణిక మెటీరియల్‌ను తీసుకొని అందులోని సమాచారాన్ని ప్రాథమిక ఆధారంగా తీసుకోవాలి. దానికి అదనపు సమాచారాన్ని జోడిస్తూ కొంత సమయం ఆదా చేసుకోవచ్చు.
5. ఒక అంశానికి సంబంధించి ఒకటి రెండు పాఠ్యపుస్తకాలకు పరిమితమైతే చాలదా?
*అభ్యర్థికి లభించే సమాచారాన్ని బట్టి మాత్రమే దీనికి జవాబు ఉంటుంది. ఎక్కువ సమయం లభ్యమైతే అదనపు పుస్తకాలను అధ్యయనం చేసి సొంత మెటీరియల్‌ను రూపొందించుకోవాలి. సమయం తక్కువున్నపుడు తక్కువ పుస్తకాలకు పరిమితమవ్వటమే సరైంది.
6. భారీ సమాచారాన్ని క్లుప్తీకరించటం ఎలా?
*కొన్ని సబ్జెక్టులకు విస్తృతస్థాయిలో మెటీరియల్‌ దొరుకుతుంది. దాన్ని ఏ స్థాయిలో, ఎంత పరిమాణంలో వినియోగించుకోవాలనేది సమస్యే. రాయబోయే పరీక్ష ఆబ్జెక్టివ్‌ అయితే సమాచారాన్ని చిన్న చిన్న ప్రశ్నలుగా మార్చుకుంటే సరిపోతుంది.
కొన్ని సబ్జెక్టుల్లో సమాచారం కొరతగా ఉంది. ఇలాంటివాటివల్ల ఆబ్జెక్టివ్‌ పరీక్షలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ గ్రూప్‌-1 మెయిన్స్‌లో ‘ఒక్కమాట’నే ఇచ్చి విశదీకరించమని అడిగే అవకాశముంది. ఉదా: ‘రాజ్యాంగ మౌలిక నిర్మితిని విశ్లేషించండి’. నిజానికి ‘మౌలిక నిర్మితి’ అనే పదం రాజ్యాంగంలో కన్పించదు. కాబట్టి సబ్జెక్టును సమగ్రంగా అర్థం చేసుకుంటేనే ఇలాంటివాటికి జవాబులు రాయటం సాధ్యమవుతుంది.
సాధ్యాసాధ్యాలు గమనించాలి!
ఆర్‌.సి. రెడ్డి మెటీరియల్‌ ఎంపిక అనేది పోటీ పరీక్షల్లో చాలా కీలకం. కనపడిన ప్రతి పుస్తకాన్నీ చదివెయ్యకూడదు. గుడ్డిగా చేసే కృషి ఫలితాలనివ్వదు. ఎంతవరకూ చదవగలమో సాధ్యాసాధ్యాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను చదివితే చాలు. ఏది ప్రామాణికమనే విషయంలో సందేహముంటే నిపుణుల సలహాలు తీసుకోవాలి. చదివే సమాచారం స్పష్టంగా, క్లుప్తంగా ఉంటే మేలు. ఒక అంశం మీద ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండటం (ప్యారలల్‌ అప్రోచ్‌) సరైంది కాదు. దీనివల్ల ఫలితం తక్కువ; సమయం వృథా. అందుకే ఒక అంశానికి సంబంధించి పరిమితంగానే, అవీ ప్రామాణిక పుస్తకాలనే ఎంచుకోవటం (వర్టికల్‌ అప్రోచ్‌) ఉత్తమం. ఏ పుస్తకాన్ని అయినా కవర్‌ పేజీనుంచి చివరిపేజీ వరకూ చదవక్కర్లేదు. పరీక్షకు అవసరమైనవే చదవాలి. ఇలా మొదటిదశ ప్రిపరేషన్‌ ముగించాలి. ఇంకా సమయం ఉంటే రెండో దశలో అదనపు పుస్తకాలు చదవొచ్చు.
గ్రూప్‌-2 మెటీరియల్‌ తయారీలో సమగ్రతకూ, సూక్ష్మతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్‌-1లో అంశాలవారీగా కీలక ప్రశ్నలను వూహించుకొని మెటీరియల్‌ తయారు చేసుకోవాలి. సొంతనోట్సు తయారీకి సమయం లేనప్పుడు ప్రామాణిక మెటీరియల్‌లోని సమాచారాన్ని ప్రాథమిక ఆధారంగా తీసుకోవాలి. దానికి అదనపు సమాచారాన్ని జోడిస్తూ సమయం ఆదా చేసుకోవచ్చు.
ఒక అంశం మీద ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండటం సరైంది కాదు. దీనివల్ల సమయం వృథా. అందుకే ఏ అంశంపైనైనా సరే, పరిమితంగా, ప్రామాణిక పుస్తకాలనే అధ్యయనం చేయాలి.

No comments:

Post a Comment