వెలుగుల బడి!


వెలుగుల బడి!
రాకుమ్‌ కరాటే ఛాంపియన్‌గానే మిగిలిపోయి ఉంటే, వందమంది వీరుల్ని ఓడించేవాడు. వేల పతకాలు సాధించేవాడు. టన్నులకొద్దీ మంచు పలకలు బద్దలుకొట్టేవాడు. కానీ, ఒక్క జీవితాన్ని కూడా వెలిగించేవాడు కాదు. ఒక్క చిరునవ్వును కూడా సృష్టించేవాడు కాదు. అందరి మనిషిగా, ఇప్పుడాపని చేస్తున్నాడు.

'గుట్టలకొద్దీ పతకాలు...
వేలకొద్దీ సన్మానాలు...
అభిమానుల కోలాహలాలు...
మీడియా కథనాలు...
ఆస్తులూ అంతస్తులూ...
జీవితమంటే ఇదేనా! ఈమాత్రం దానికేనా ఎడతెరిపిలేని పరుగు? విజయమంటే ఇంతేనా! ఈ ఆనందం కోసమేనా ఇన్నాళ్ల తపన? ఇదే విజయమైతే, ఆ విజయం నాకొద్దు. ఇదే జీవితమైతే, ఆ జీవితం నాకక్కర్లేదు'...
రాజ్యం వీడిన బుద్ధుడిలా, సర్వం పరిత్యజించిన మహావీరుడిలా ఆ యువకుడిలో అంతర్మథనం.
రాకుమ్‌...
మలేసియాలో పుట్టాడు. తండ్రి బ్రిటిష్‌ ఆర్మీలో ఉద్యోగి. తల్లి గృహిణి. వెుత్తం ఏడుగురు పిల్లలు. తను నాలుగోవాడు. చదువు అబ్బలేదు. కరాటే అంటే మాత్రం ప్రాణం. ఆ పట్టుదల చూసి, కన్నవాళ్లు అడ్డుచెప్పలేదు. మలేసియాలో నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాక, జపాన్‌ వెళ్లాడు. అక్కడ మాస్‌ ఒయామా అనే కాకలుతీరిన యోధుడి దగ్గర క్యోకుషన్‌ కరాటే సాధనచేశాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బ్యాంకాక్‌...ఎక్కడ ఏ కొత్త మెలకువ నేర్చుకునే అవకాశం ఉన్నా, వదులుకోలేదు. కరాటే, కిక్‌బాక్సింగ్‌లలో ఎదురులేని నైపుణ్యం సాధించాడు. దేశదేశాలు తిరిగాడు. యోధానయోధులను మట్టికరిపించాడు. వెళ్లినచోటెల్లా జెండా పాతాడు. కరాటే శిక్షణ సంస్థలు ప్రారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా నూటనలభై శాఖలు వెలిశాయి. ఒక్కోశాఖా వందలమంది ఛాంపియన్లను తయారుచేసింది.
అదో కరాటే జైత్రయాత్ర!
భారత్‌...ఆ యాత్రలో ఒక మజిలీ. పోటీలూ విజయాలూ సన్మానాలూ సత్కారాలూ...షరామామూలే! వీరుల్ని ఎలా గౌరవించాలో భారతదేశానికి ఎవరూ చెప్పాల్సిన పన్లేదు. రాకుమ్‌ దగ్గర శిష్యరికం చేయడానికి యువత ఉత్సాహం చూపింది. దేశవ్యాప్తంగా శాఖలు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో... ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణ రాకుమ్‌ శిక్షణ కేంద్రమైంది. కొన్నాళ్లకి ఆయన మనసు రికార్డుల మీదికి మళ్లింది. అమెరికాకు చెందిన జాన్‌.జె.విలియమ్స్‌ 1987లో ఎనిమిది ఐసు పలకలను ఒక్క పిడిగుద్దుతో పగులగొట్టి గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. సరిగ్గా ఏడాది తర్వాత...ఏకంగా తలతోనే తొమ్మిది పలకలను ముక్కలుముక్కలు చేసి... సరికొత్త రికార్డు నెలకొల్పాడు రాకుమ్‌. అదో సంచలనం. ఆ విజయం వెనుక 365 రోజుల కఠోర సాధన ఉంది. ఇప్పటికీ ఆ రికార్డువైపు కన్నెత్తిచూసే ధైర్యం చేయలేకపోతున్నారెవరూ. ఆ విజయంతో దేశమంతా రాకుమ్‌ పేరు మారువోగింది. పత్రికల్లో కథనాలు, టీవీ ఇంటర్వ్యూలు, సలహా కోసం వచ్చేవారు, సన్మానం చేస్తామని అడిగేవారు...రాకుమ్‌ సెలెబ్రిటీ అయిపోయాడు.
ఆ వైభోగాన్నీ ప్రచారాన్నీ పూర్తిగా ఆస్వాదించకముందే...మనసులో అంతుచిక్కని వెలితి. తీవ్రమైన అంతర్మథనం. 'ఈ ఆనందం అశాశ్వతం. నీ దారి వేరు. నువ్వు సాధించాల్సిన లక్ష్యం వేరు. నీలో ఉన్న నిగూఢశక్తులనూ సేవాతత్పరతనూ సద్వినియోగం చేసుకో'... కరాటే నేర్పిన గురువు, జీవితాన్నిచ్చిన దేవుడు మాస్‌ ఒయామా హెచ్చరిస్తున్న భావన. కలలోనూ మెలకువలోనూ ఆ మాటలే. భ్రమలాంటి నిజం. స్పష్టాస్పష్టమైన సంకేతం. ఆ అంతర్మథనంలోంచి కొత్త రాకుమ్‌ పుట్టుకొచ్చాడు. కోరికోరి సాధించిన విజయాలు కొరగానివైపోయాయి. నిన్నటిదాకా మత్తెక్కించిన ప్రచారం అర్థంలేని ఆర్భాటంలా అనిపించింది. గెలుపు పతకాలు చిల్లునాణాల్లా కనిపించాయి. రుషీకేష్‌లోని శివానంద ఆశ్రమంలో గడిపిన ఆధ్యాత్మిక జీవితం, యోగసాధన...రాకుమ్‌ ఆలోచనల్ని ప్రభావితం చేశాయి. బంధాలూ బంధుత్వాలూ... లక్ష్యసాధనలో బంధనాలు అవుతాయేవో అని భయపడ్డాడు. అందుకే బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న కరాటే శిక్షణ సంస్థల్ని మూసేశాడు. కొన్నింటిని శిష్యులకు అప్పజెప్పాడు. జనం మధ్యకి వచ్చేశాడు.
''ఒక్క నిమిషం చికటికే భయపడిపోతామే. వెలుతురు కోసం తహతహలాడిపోతామే. జీవితమంతా చికటైతే? జీవితమే చికటైతే? ఎంత దుర్భరం? ఎన్ని సవాళ్లు? చేతులతో శూన్యాన్ని స్పృశిస్తూ...ఎటువైపుందో తెలియని గమ్యం దిశగా నిరాశతో అడుగేసే ఆ చికటి బతుకులకు ఆసరా ఇవ్వాలి, అండగా నిలవాలి''...అంధులను తలుచుకోగానే రాకుమ్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆలోచనలో స్పష్టత వచ్చింది. ఆచరణ ప్రారంభమైంది.
అప్పటికి రాకుమ్‌ వయసు ముప్పై ఆరేళ్లు!
ఇక నుంచి కథనంలో మనకు రాకుమ్‌ ప్రత్యక్షంగా కనిపించడు. ఆయన ఆలోచనలకూ ఆశయాలకూ ప్రతీకగా నిలిచే పాఠశాలే కనిపిస్తుంది. తమకో జీవితాన్నిచ్చిన మనిషిని ముద్దుగా 'కంచో...కంచో' (కరాటే యోధుడు) అని పిలిచే పసిపిల్లలే కనిపిస్తారు. చికటిని చిల్చుకుని ముందుకెళ్లే అంధుల ఆత్మవిశ్వాసమే కనిపిస్తుంది.

అక్షర దీపం
శ్రీ రాకుమ్‌ అంధుల పాఠశాల...
బెంగళూరు శివార్లలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ప్రారంభమైంది. వెుత్తం ముగ్గురు విద్యార్థులు. ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయుడు, సంరక్షకుడు...అన్ని పాత్రల్లోనూ రాకుమ్‌! తమలాంటి వారికోసమే ఓ మంచిమనిషి పాఠశాల ప్రారంభించాడని తెలిసి, ఎక్కడెక్కడి అంధబాలలూ ఇక్కడికొచ్చారు. ఆశగా నిరుపేదలూ తలుపుతట్టారు. రాకుమ్‌ ఎవర్నీ నిరాశపరచలేదు. స్థోమతకు మించిన బాధ్యతలే నెత్తినేసుకున్నాడు. తొలిరోజుల్లో అయితే దినదినగండమే. ఏ దాతో కరుణించకపోతే, మరుసటిరోజు ఉపవాసమే. కానీ రాకుమ్‌ పాఠశాల పిల్లలకు ఆ పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఏదో అద్భుతం జరిగినట్టు.. ఎవరో ఒకరు సరిగ్గా సమయానికొచ్చి ఆదుకునేవారు.
పన్నెండేళ్లలో ఆ బడి మూడుశాఖలుగా విస్తరించింది. దేవనహళ్లిలో మూడువందల మంది విద్యార్థులున్నారు. బెంగళూరు ఆవరణలో నూటడెబైశ్భమంది ఉన్నారు. అర్కవతి శాఖలో ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలున్నారు. మూడు అవరణలూ కలిపి ఐదువందల పైమాటే. అందులిో రెండువందలమంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. అరవైమంది డిగ్రీ చదువుతున్నారు. పదిహేనుమంది పీజీ చదువుతున్నారు. పదిమంది బీఎడ్‌ చేస్తున్నారు. ఎనిమిదిమంది సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. ఒక్కసారి ఆ ఆవరణలో అడుగుపెడితే చాలు, అంధులకూ నిరుపేదలకూ నిశ్చింత. ఒకటో తరగతి నుంచి పోస్టుగ్రాడ్యుయేషన్‌ వరకూ చదువుకోవచ్చు. ఫీజుల గురించి బెంగపెట్టుకోనక్కర్లేదు. ఆకలి గురించి ఆలోచించాల్సిన పన్లేదు. ప్రేమ దొరకదేవో అన్న బాధా లేదు.
అది... మమతల గుడి.
చదువుల బడి!
రాకుమ్‌ పాఠశాలలో ఏ కార్పొరేట్‌ విద్యాసంస్థకూ తక్కువకాని వసతులున్నాయి. ఏ ఇంటర్నేషనల్‌ స్కూల్‌తో అయినా పోటీపడగల టెక్నాలజీ ఉంది. డిజిటల్‌ స్క్రీన్‌ మీద పాఠాలు చెబుతారు. సాధారణ పుస్తకాలను బ్రెయిలీ లిపిలోకి తర్జుమా చేసే యంత్రాలను స్వీడన్‌ నుంచి తెప్పించారు. ఆధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌, సమావేశ మందిరం ఉన్నాయి. దేశవిదేశాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ఉంది. అంధులు సులభంగా ఉపయోగించేందుకు వీలైన కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉంది. అలా అని, రాకుమ్‌ పాఠశాల సంప్రదాయ మూలాల నుంచి దూరంగా వెళ్లిపోలేదు. క్రమశిక్షణలో, విలువల విషయంలో గురుకులాన్ని తలపిస్తుంది. పరిసరాలు అచ్చంగా పల్లెటూరిలా ఉంటాయి. పిల్లలు పుస్తకాల చదువులకే పరిమితం కాలేదు. తోటపని చేస్తారు. పశుపోషణలో పాలుపంచుకుంటారు. చేతివృత్తుల్లో నైపుణ్యం సంపాదిస్తారు. దేవనహళ్లి ఆవరణలో గోశాల కూడా ఉంది. ఆ వ్యర్థాలతో తయారయ్యే బయోగ్యాస్‌తోనే వంటలు చేస్తారు. నాలుగు సంవత్సరాల క్రితం రాకుమ్‌ గోదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. 'డొక్కెండిపోయిన పశువుల్ని ఏ కసాయి కార్ఖానాలకో తరలించకండి. మాకిస్తే మహద్భాగ్యంగా భావిస్తాం. వాటిని జీవితాంతం ప్రేమగా చూసుకుంటాం' అని అభ్యర్థించారు. ఆ పిలుపునకు స్పందనగా వచ్చినవే ఈ గోవులన్నీ. వీటిద్వారా రోజూ నాలుగువందల లీటర్ల పాలు సేకరిస్తారు. గోమాతల పుణ్యమాని పిల్లలకు పాలు, పెరుగు, నెయ్యి పుష్కలంగా దొరుకుతున్నాయి. ఈ గోశాలను నెలకు యాభైవేల లీటర్ల స్థాయికి అభివృద్ధిచేయాలన్నది రాకుమ్‌ లక్ష్యం. బడి ఆవరణలోనే కూరగాయలు, పండ్లు, ధాన్యం సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్నారు. పిల్లల అవసరాలకుపోగా, మిగిలినవాటిని మార్కెట్‌కు తరలిస్తారు. రాకుమ్‌ పాఠశాలకు ఇది కూడా ఓ ఆదాయవనరే.

అంతా సమానం!
రాకుమ్‌ పాఠశాల విద్యార్థులు చదువులో భాగంగా జర్మన్‌, జపనీస్‌, సంస్కృతం నేర్చుకుంటారు. సంస్కృతం భారతీయ సంస్కృతికి ప్రాణం. మరి జర్మన్‌, జపనీస్‌ ఎందుకు? ఆ దేశాలు...శిథిలాల్లోంచి ఈ స్థాయికి వచ్చాయి. ఆ చరిత్రలు, విజయయాత్రలు...విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలన్నది రాకుమ్‌ ఆలోచన. నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, యోగా... సిలబస్‌లో భాగం. 'కరాటే ఆత్మరక్షణకు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి. సంగీతం ఆత్మానందానికి...' అని చెబుతారు రాకుమ్‌. పద్ధెనిమిదేళ్లు నిండిన ఆరోగ్యవంతులందరూ డ్రైవింగ్‌ నేర్చుకోవాల్సిందే. ఈ బళ్లో అంధులూ మిగతా విద్యార్థులూ కలిసే చదువుకుంటారు. గురువులు కూడా ఇద్దరికీ ఒకేసారి పాఠం చెబుతారు. ఒకరు మామూలు పుస్తకాలు చదివితే, ఇంకొకరు బ్రెయిలీ మీద ఆధారపడతారు. అంతే తేడా. తరగతిలో, హాస్టల్లో, భోజనశాలలో... ఎక్కడికెళ్లినా మిగతా విద్యార్థులు అంధులకు సాయంగా ఉంటారు. ఇద్దరిద్దరు ఒక జట్టు. బాలబాలికలకు వేరువేరుగా హాస్టలు వసతులున్నాయి. 'ప్రతి విద్యార్థినీ ప్రేమిస్తాం, గౌరవిస్తాం, ప్రోత్సహిస్తాం. మేం విద్యార్థులను విడదీసి చూడం. అంధులైనా, సంపూర్ణ ఆరోగ్యవంతులైనా మా దృష్టిలో సమానమే. చదువు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి. ఆత్మన్యూనత కలిగించకూడదు' అంటారు రాకుమ్‌. దేవనహళ్లి పాఠశాల ఆవరణలో నిరుపేదల కోసం ఓ వైద్యశాలను ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల మహిళలకూ పిల్లలకూ ఇదో వరం. దీన్ని నూటయాభై పడకల ఆసుపత్రిగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు రాకుమ్‌ ఇందులో అంబులెన్స్‌ కూడా ఉంది.

ప్రతినెలా ఒకటో తేదీ సేవాదినోత్సవం. సుమారు రెండువేలమంది అంధులకూ నిరుపేద వృద్ధులకూ వంద రూపాయల చొప్పున పింఛను అందిస్తారు. ఐదుకిలోల బియ్యం, కిలో కందిపప్పు, సబ్బు, పేస్టు వంటి నిత్యావసరాలు ఇస్తారు. దాతల నుంచి సేకరించిన పాతబట్టలు, దుప్పట్లు, మందులు, వంటపాత్రలు పంపిణీ చేస్తారు. ఓసారి రాకుమ్‌ ఏదో సేవాకార్యక్రమంలో పాల్గొనడానికి ఓ మురికివాడకు వెళ్లారు. అక్కడో దృశ్యం ఆయన్ని కదిలించింది. ఎదురుగా తండ్రి శవాన్ని పెట్టుకుని...అంత్యక్రియల ఖర్చులు ఎవరు భరించాలనే విషయంలో కొడుకులిద్దరూ గొడవపడుతున్నారు. తప్పు వాళ్లది కాదు, పేదరికానిది! దారిద్య్రం మమతల్నీ మమకారాల్నీ మింగేస్తుంది. 'ఎవరికీ ఆ దుస్థితి రాకూడదు..' అనుకున్నారు రాకుమ్‌. అప్పటి నుంచి నిరుపేదల అంతిమసంస్కారాలకు తనవంతు సాయం చేస్తున్నారు.

ఏ పనైనా...
అప్పట్లో ఇన్ని వసతుల్లేవు. ఇంతమంది సిబ్బంది లేరు. రాకుమ్‌తో పాటు ఒకరిద్దరు టీచర్లు స్కూలు వ్యవహారాలన్నీ చూసేవారు. వంట, పాత్రలు కడగడం, టాయిలెట్లు శుభ్రంచేయడం... అన్నిపనులూ రాకుమ్‌ ఒంటిచేత్తో చేసేవారు. ఎదిగేకొద్దీ పిల్లలు బాధ్యత పంచుకోవడం వెుదలుపెట్టారు. రాకుమ్‌కు పనిభారం తగ్గింది. అక్కడి విద్యార్థులకు రాని విద్యంటూ లేదు. వంటావార్పూ, కమ్మరి పని, కుమ్మరి పని, వ్యవసాయం...ఏదైనా చేయగలరు. రాకుమ్‌ ఆ జీవన నైపుణ్యాల్ని చదువుల్లో భాగం చేశారు. ఇంటర్నేషనల్‌ కల్చరల్‌ యూత్‌ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్‌ కింద జపాన్‌ నుంచి కొంతమంది స్వచ్ఛంద సేవకులు వచ్చి, తమవంతు సేవలు అందిస్తూ ఉంటారు.
స్కూల్లో ఎవరి పుట్టినరోజు జరిగినా... వంటశాలలో కమ్మని కేకు తయారుకావాల్సిందే. రుచిగా తయారుచేయడానికి సీనియర్లు పోటీపడతారు. దాదాపుగా రోజూ ఎవరో ఒకరి బర్త్‌డే ఉంటుంది. ఆ లెక్కన, రాకుమ్‌ స్కూలు విద్యార్థులు రోజూ నోరు తీపిచేసుకుంటారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం, అప్పటికీ ఇప్పటికీ ఒకటే శిక్ష... రాకుమ్‌ ఆ పూట భోంచేయరు. తమ కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆకలితో నీరసపడిపోతే, పిల్లలు విలవిల్లాడిపోతారు. ఇంకెప్పుడూ ఆ పొరపాటు చేయరు.
ఇక్కడే పెరిగి...
రాకుమ్‌ స్కూల్లో అక్షరాలు నేర్పించడం ఒక్కటే కాదు, ఆత్మవిశ్వాసం కూడా నూరిపోస్తారు. అందుకే, ఆ బళ్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం ఓ సమస్యే కాదు. కానీ, పట్టాచేతికిరాగానే రెక్కలు కట్టుకుని ఏ కార్పొరేట్‌ సంస్థలోనో వాలిపోవాలన్న కోరిక ఏ ఒక్కర్లోనూ కనిపించదు. 'ఇక్కడే ఉంటాం... కంచోకు అండగా నిలబడతాం' అనేవారే ఎక్కువ. ఇప్పుడు వార్డెన్లుగా, కేర్‌టేకర్లుగా, ప్రధానోపాధ్యాయులుగా సేవలు అందిస్తున్నవారంతా ఆ బళ్లో చదువుకున్న విద్యార్థులే. వీణాకుమారి, శారద, నరసింహారెడ్డి, మంజునాథ, మమత, నిరుపమ... ఆ జాబితా చాలా పెద్దది.
గాలి పీల్చి, ఆ ఆత్మవిశ్వాసం నింపుకుని జీవితాల్ని మార్చుకున్నవారు ఎంతోమంది. జపనీస్‌, జర్మన్‌, సంస్కృతం గడగడా మాట్లాడే నరసింహారెడ్డి వెుహంలో అపారమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. చిన్నప్పుడే కళ్లుపోవడంతో ఓరకంగా పిచ్చివాడైపోయాడు. పాతికేళ్ల వయసులో అతన్ని తీసుకొచ్చారు. ఇక్కడే పదోతరగతి పాసయ్యాడు, ఫస్ట్‌ క్లాస్‌లో! ప్రస్తుతం ఎమ్మే చేస్తున్నాడు. మానసిక చికిత్స కూడా పూర్తికావచ్చింది. 'పీజీ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలన్నది నా ఆలోచన' అంటాడాయన. ఆరోతరగతి చదువుతున్నప్పుడు వీణాకుమారి చూపు మందగించింది. దీంతో పదకొండేళ్లపాటు ఇంట్లిోనే, నాలుగుగోడల మధ్యే గడిపింది. రాకుమ్‌ స్కూలు గురించి ఎవరో చెప్పగా విని, ఆశగా ఇంతదూరం వచ్చింది. ఈమధ్యే పీజీ పాసైంది. హాస్టల్లో ఉద్యోగం చేస్తోంది. కరాటేలో బ్రౌన్‌బెల్ట్‌ తెచ్చుకుంది. యోగా క్లాసులు తీసుకుంటుంది. పిల్లలంతా తనని 'వీణక్కా' అని ప్రేమగా పిలుచుకుంటారు. శారద కూడా వీళ్లందరిలాగానే బిక్కుబిక్కుమంటూ బళ్లో అడుగుపెట్టింది. తనకిప్పుడు కంప్యూటర్స్‌ కొట్టినపిండి. పద్మ అయితే పొలిటికల్‌సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్‌ ముగించుకుని ప్రాథమిక పాఠశాల హెడ్‌మిస్ట్రెస్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఎలాంటి చదువులూ లేని రూప హాస్టలు వార్డెనుగా సమర్థంగా పనిచేస్తోంది. వినీత పీజీ పూర్తిచేసింది. వాసు అనే భవననిర్మాణ వ్యాపారి ఆమె చదువునూ సంస్కారాన్నీ ఇష్టపడి పెళ్లిచేసుకున్నాడు. సెలవురోజుల్లో, ప్రత్యేక సందర్భాల్లో ఆ దంపతులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆరునెలల పసికందుగా ఉన్నప్పుడే అరసిని అమ్మానాన్నలు వీధులపాలు చేశారు. ఎవరో రాకుమ్‌ పాఠశాలకు తీసుకొచ్చారు. వచ్చిన కొత్తలో చిపురుపుల్లలా ఉండేది. బతికి బట్టకడుతుందని ఎవరూ అనుకోలేదు. నిబంధనల ప్రకారమైతే రెండున్నరేళ్లు నిండినవారికే ప్రవేశం. నిబంధనల కంటే మానవత్వమే గొప్పదని నమ్ముతారు రాకుమ్‌. అందుకే, మరో ఆలోచన లేకుండా ఆ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకున్నారు. అప్పుడు చూడాలి...నలుపు తప్ప మరో రంగు తెలియని ఆ పసిదాని వెుహంలో, వేయిపున్నముల కాంతి! తనిప్పుడు ఆ బళ్లోనే చదువుకుంటోంది. ఎంత చురుకైన పిల్లో!
తన దగ్గర చదువుకున్న విద్యార్థులు జీవితంలో స్థిరపడ్డాక...చక్కని వరుడినో వధువునో వెతికిపెట్టే బాధ్యత కూడా రాకుమ్‌ తీసుకుంటున్నారు. దేశంలోనే వెుట్టవెుదటిసారిగా అంధుల కోసం 'స్వయంవరం' నిర్వహించిన ఘనతా ఆయనదే. ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఖర్చులన్నీ సంస్థే భరించింది. వాళ్లంతా పిల్లాపాపలతో హాయిగా ఉన్నారు. ఒక్క కర్ణాటకే కాదు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు నుంచి కూడా ఎంతోమంది అంధులు ఆశ్రయం కోసం, చదువుల కోసం ఇక్కడికి వస్తుంటారు. ఆర్థికంగా పరిమితులున్నా, నిధుల కొరత ఉన్నా రాకుమ్‌ ఇప్పటిదాకా ఎవర్నీ వెనక్కి పంపలేదు. 'అనుకోని ఆర్థిక సమస్యలొచ్చి ఈ బడిని మూసేయాల్సి వస్తే?'..ఓసారి ఎవరో అడిగారు. 'నేను ఉన్నంతకాలం, బతికున్నంతకాలం...అలాంటి పరిస్థితి రానివ్వను'... స్థిరంగా జవాబిచ్చారు ఆయన.
మీలాంటి సహృదయులు చల్లగా ఉండాలి రాకుమ్‌! వందేళ్లు... కాదుకాదు... వెయ్యేళ్లు వర్ధిల్లండి.

మీ సాయం-మాకు ప్రాణం!

'వియ్‌ లివ్‌ విత్‌ వాట్‌ యు గివ్‌'...రాకుమ్‌ పాఠశాల విరాళాల పెట్టె మీద కనిపించే ఈ నినాదం ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. నిజమే, ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో నలుగురు మనుషులున్న మధ్యతరగతి కుటుంబం నెట్టుకురావడమే గగనమైపోయింది. అలాంటిది, అంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు...ఓ వ్యవస్థ నిరాటంకంగా సాగాలంటే ఎన్ని నిధులు కావాలి?
రాకుమ్‌ విద్యాసంస్థల నిర్వహణకు నెలనెలా లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. చందాల కోసవో, సంస్థ ప్రచారం కోసవో విద్యార్థుల్ని వీధుల్లోకి తీసుకెళ్లడం రాకుమ్‌కు ఇష్టం ఉండదు. దీనివల్ల పిల్లల ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఆయన భయం. ప్రచారం గురించి పెద్దగా పట్టించుకోడు. కార్పొరేట్‌ వితరణలూ సామాన్యుల విరాళాలూ... ఇప్పటికీ ఇవే ప్రాణాధారం. ప్రభుత్వం నుంచి ఒక్కపైసా కూడా అందడం లేదు.
ఈ మహత్కార్యంలో అందరూ తనకు అండగా నిలబడాలని కోరుతున్నారు రాకుమ్‌. మనసుంటే ఎన్నో మార్గాలు. విద్యార్థులకు పుస్తకాలు ఇప్పించవచ్చు. భోజనం ఖర్చులు భరించవచ్చు. నిత్యావసర వస్తువులు, పాత బట్టలు విరాళంగా ఇవ్వవచ్చు. స్వచ్ఛంద సేవకులుగా పనిచేయవచ్చు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉంటున్నవారైతే...విందులూ వినోదాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఇవ్వొచ్చు. చిత్రలేఖనం, యోగా, నాట్యం... నైపుణ్యాలను పిల్లలకు పంచవచ్చు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో...దుబారా విందులు వద్దనుకుంటే... అయిదొందల మంది నిర్భాగ్యులు ఓ పూట కడుపునిండా భోంచేస్తారు. 'అన్నదాతా సుఖీభవ' అని మనసారా ఆశీర్వదిస్తారు.
పేదల సన్యాసి
స్కూలు ఆవరణలో పిల్లల మధ్య పసివాడిలా, పెద్దల మధ్య పెద్దమనిషిలా కనిపించే రాకుమ్‌ను అంతర్జాతీయ కరాటే ప్రపంచం ముద్దుగా 'పేదల సన్యాసి' అని పిలుచుకుంటుంది. తెల్లవారుజామున నాలుగింటికి వెుదలయ్యే ఆయన దినచర్య ఏ అర్ధరాత్రో అకౌంటు పుస్తకాల్ని సర్దేయడంతో పూర్తవుతుంది. 'ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోరా?' అని ఎవరైనా అడిగితే, 'అంధత్వానికి విశ్రాంతి ఉంటుందా? నా పిల్లల ఆకలికి విశ్రాంతి ఉంటుందా?' అని ప్రశ్నిస్తాడు రాకుమ్‌. 'పెళ్లెప్పుడు చేసుకుంటారు?' అని చొరవగా అడిగేవారికీ అంతే ఘాటుగా జవాబిస్తాడు...'పెళ్లంటే ఏమిటి? బంధమేగా! నిరుపేదలూ అంధులూ ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలతో నాకు అనుబంధం ఏర్పడింది. అది వివాహబంధంకంటే బలమైంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా పిల్లలే. నా కుటుంబం ఎంత పెద్దదో చూడండి'. పేదల మనిషిని అలాంటి ప్రశ్నలడిగి ఆటపట్టించాలని అనుకున్న వారి కళ్లలో పశ్చాత్తాపంతో నీళ్లు తిరుగుతాయి. 'ఇంతమంది పిల్లలకు జీవితాన్నిచ్చారు. మీ రుణం...' ఎవరైనా తనని మెచ్చుకోబోతే, నిర్మొహమాటంగా అడ్డుచెబుతాడు. 'ఇదంతా నా గొప్పదనమేం కాదు. నేను ఆటలో ఫీల్డర్‌లాంటి వాడిని. ఓవైపు నుంచి వచ్చే బంతిని జాగ్రత్తగా అందుకుని... మరోవైపుకు విసిరేయడమే నాపని! అటువైపు సంపన్నులున్నారు, ఇటువైపు పేదలున్నారు'అని వినయంగా చెబుతాడు.
ఈ బడిని ఎలా తీర్చిదిద్దాలి అనే విషయంలో అతనికి భారీ ప్రణాళికే ఉంది... 'సౌరశక్తినీ పవనశక్తినీ వాడుకోవాలి. పాఠశాలకు అవసరమైన విద్యుత్‌ తయారు చేసుకోవాలి. మరికొంత వ్యవసాయభూమిని సేకరించి, బిందు సేద్యం ద్వారా పంటలు పండించాలి. దీనివల్ల నిత్యావసర వస్తువుల కొరత తీరుతుంది. ముగ్గురు పిల్లలతో వెుదలైన మా పాఠశాల ఇప్పుడు పోస్టు గ్రాడ్యుయేట్లను కూడా అందిస్తోంది. దీన్నో విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలన్నది నా ఆశయం'.
కఠినమైన రాళ్లను సైతం సునాయాసంగా పగులగొట్టిన చేతికి.. సమస్యలూ ఆర్థిక పరిమితులూ ఓ లెక్కా! రాకుమ్‌ ఛేదిస్తాడు. అనుకున్నది సాధిస్తాడు.
రాకుమ్‌ అంధుల పాఠశాల ఫోన్‌ నంబర్లు 080-25215253 
వెబ్‌సైట్‌: www.rakum.org

No comments:

Post a Comment