Showing posts with label GEOGRAPHY. Show all posts
Showing posts with label GEOGRAPHY. Show all posts

మన భౌగోళికంపై మీకు పట్టుందా ?



                       మన భౌగోళికంపై మీకు పట్టుందా ?

ఎ. ఎం. రెడ్డి
కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌
ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలపై అవగాహన అవసరం. ఈ సబ్జెక్టును చదవటంలో కొన్ని మెలకువలు పాటిస్తే తేలిగ్గా పట్టు సాధించవచ్చు!
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నిర్వహించే ఏ పోటీ పరీక్షలోనైనా జనరల్‌స్టడీస్‌ పేపర్‌ తప్పనిసరి. గ్రూప్‌-1 మెయిన్స్‌లో కూడా దీని పాత్ర కీలకమే. ఈ పరీక్షలన్నింటిలో అభ్యర్థుల మెరిట్‌ను, తద్వారా వారి తుది ఎంపికను నిర్థారించేదిగా జనరల్‌స్టడీస్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పేపర్లో భూగోళశాస్త్రం (జాగ్రఫీ) నుంచి దాదాపు 25 ప్రశ్నలు వస్తాయి. జనరల్‌స్టడీస్‌
ఏపీపీఎస్సీ వారు ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ 'Focus on AP Geography' అని స్పష్టంగా పేర్కొన్నారు. అందుకే పరీక్ష సన్నద్ధతలో ఈ విభాగంపై ప్రత్యేక దృష్టి అవసరం. మొత్తం భూగోళశాస్త్రం నుంచి వచ్చే 25 ప్రశ్నల్లో నాలుగో వంతు- అంటే ఆరేడు ప్రశ్నలు ఆంధప్రదేశ్‌ భౌగోళికాంశాలపై ఉంటాయి. పోటీ పరీక్షల్లో అభ్యర్థుల తుది ఎంపికను నిర్ణయించేది ఒకే ఒక మార్కు కదా!
గ్రూప్‌-2 పేపర్‌ III
గ్రూప్‌-2 పరీక్షకు సంబంధించి మూడో పేపర్‌ రెండో విభాగం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినదే. మొత్తం 75 మార్కులకు దాదాపు 40 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాల నుంచి వస్తాయి. నిజానికి గత గ్రూప్‌-2 పరీక్షలో అభ్యర్థుల తుది ఎంపికను ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాల ప్రశ్నలే నిర్ణయించాయి. దీనికి కారణం చాలామంది అభ్యర్థులు ఈ విభాగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవడమే!
ఒకవేళ ఈ అంశాలపై కేంద్రీకరించి సిద్ధమవుదామంటే సరైన తాజా సమాచారం గల పుస్తకాలు గానీ, స్టడీ మెటీరియల్‌ గానీ అందుబాటులో లేకపోవడం మరో సమస్య. కాబట్టి రాబోయే గ్రూప్‌-2 పరీక్షలో ఈ విభాగంపై దృష్టి కేంద్రీకరించి తాజా సమాచారాన్ని సేకరించి సిద్ధం కావలసివుంటుంది.
గ్రూప్‌-1 మెయిన్స్‌
ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనీసం వంద మార్కుల ప్రశ్నలు గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఉంటాయి.
ఈ అంశాలను చదవటానికి ముందు భారతదేశ భూగోళశాస్త్రంపై పట్టు సాధించాలి. భౌగోళికాంశాల మౌలిక భావనలను ముందు అర్థం చేసుకోవాలి. వాటిని భారతదేశ భౌగోళికాంశాలకు అన్వయం చేసుకొని, తరవాత వాటిని ఆంధ్రప్రదేశ్‌కు అన్వయించుకుంటే సబ్జెక్టు సునాయాసంగా అర్థమవుతుంది. అంటే భారతదేశ భౌగోళికాంశాలలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాటిని అనుసంధానం చేసుకోవలసి ఉంటుందన్నమాట!
ఉదాహరణకు భారతదేశ ఎల్లలు, భౌగోళిక విస్తీర్ణం, సముద్రతీరం పొడవు, వివిధ రాష్ట్రాల భౌగోళిక స్వరూపం (మ్యాప్‌ల రూపంలో), ప్రధాన భూస్వరూపాలు (పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, సరస్సులు, మృత్తికలు, శీతోష్ణస్థితి, అటవీ సంపద, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయం, ముఖ్యమైన పంటలు, పశుపోషణ, ఖనిజ సంపద, పరిశ్రమలు, రవాణా, సమాచార సాధనాలు, జనాభా మొదలైనవి) చదివేటప్పుడు ముందుగా భారతదేశ భౌగోళికాంశాలను చదవాలి. ఆ తరవాత వాటికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను అనుసంధానం చేసుకోవాలి.
భౌగోళికాంశాలు తప్పనిసరిగా చిత్రపటాలను (మ్యాపులు) ముందుంచుకొనే చదవాలి.
జనాభా
రెండు/ మూడు ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అంశం జనాభా. భారత్‌, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన జనాభా అంశాలన్నింటిని, రాష్ట్రాలు- జిల్లాల వారీగా (శాతాల రూపంలో) జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా త్వరలో రాబోయే 2011 జనగణన వివరాలను 2001 జనగణనతో పోల్చి చదవాలి.
ఉదాహరణకు- జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్‌ భారతదేశంలో ఏ స్థానంలో ఉంది? లేదా ఏయే రాష్ట్రాల జనాభా ఏపీ కంటే ఎక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్‌ జనాభా దేశ జనాభాలో 2001లో ఎంత ఉంది? 2011లో ఎంత ఉంది? జనాభా వృద్ధిరేటులో జరిగిన మార్పు, షెడ్యూలు కులాల, తెగల జనాభా - జిల్లాల వారీగా శాతాలలో చదవాల్సి ఉంటుంది. 2011 జనగణనలో వెనుకబడిన వర్గాల వారి లెక్కింపు కూడా ఉంది కాబట్టి మొత్తం రాష్ట్రజనాభాలో వారి శాతం మొదలైన అంశాలన్నింటిని పోలుస్తూ చదవాలి.
గ్రూప్‌- 2
గ్రూప్‌-2 పరీక్ష విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీ కీలకపాత్ర వహిస్తుంది. సిలబస్‌లోనే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ అడవుల విస్తీర్ణం, విస్తరణ; స్థూల- నికర సాగుభూమి; వివిధ రకాల నీటిపారుదల సౌకర్యాలు, వాటి విస్తరణ, శాతాలు; ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్‌లో పంటల విధానం, వాటిలో మార్పు- వాటి విస్తరణ, ఉత్పత్తి; రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు- అభివృద్ధి, విస్తరణ; రాష్ట్రంలో సేవారంగం, ప్రసార మాధ్యమాలు, రవాణా, టూరిజం సమాచార సాంకేతిక విజ్ఞానానికి సంబంధించిన ప్రముఖ కంపెనీలు, వాటి ఉత్పత్తులు, సాలీనా ఆదాయం, రాష్ట్రంలో జీవ సాంకేతిక విజ్ఞానం వాటికి సంబంధించిన ప్రత్యేక పార్కులు; రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) మొదలైనవి తాజా సమాచారంతో చదవాలి.
తాజా సమాచారం
ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రానికి సంబంధించిన సమాచారానికి ప్రధాన ఆధారం తెలుగు అకాడెమీ ప్రచురించిన ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రం. కానీ ఈ పుస్తకాన్ని ఎప్పటికప్పుడు నవీకరించటం (అప్‌డేట్‌) చేయకపోవడం వల్ల తాజా సమాచారం, ఇటీవల అభివృద్ధి కార్యక్రమాలు లభించవు. వాటిని ఎప్పటికప్పుడు వార్తాపత్రికల్లో కానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించే ఆంధ్రప్రదేశ్‌ మాసపత్రిక నుంచి కానీ సేకరించాలి. శాఖాపరమైన సమాచారాన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆయా శాఖలు కొన్ని ప్రముఖ వార్తాపత్రికలలో ఇచ్చే ప్రకటనల ద్వారా సేకరించి చదవవలసి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక, ఆర్థికాంశాలకు సంబంధించిన తాజా సమాచారం రాష్ట్రప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు ప్రచురించే 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే' పుస్తకంలో లభిస్తుంది. దీన్ని ఆంగ్లంలో ముద్రిస్తారు. దీనిని ఒకటికి రెండుసార్లు చదివి అర్థం చేసుకుని ముఖ్యాంశాలను ప్రత్యేకంగా నోట్‌ చేసుకుని చదవాలి. ఎ.పి. సమాచారానికి ఈ పుస్తకం అత్యంత కీలకమని మరవకూడదు. ఒక్కమాటలో చెప్పాలంటే, పరీక్షలోని సగం ప్రశ్నలు అందులో నుంచే వస్తాయి. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ఇటీవల సమాచారం ఆధారంగా ఉంటాయి. కాబట్టి ప్రతి అంశాన్నీ ప్రాథమికాంశాలతో పాటు తాజా సమాచారంతో అధ్యయనం చేస్తే ఎ.పి. జాగ్రఫీలోని ప్రశ్నలన్నింటికీ సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు.
గ్రూప్‌-1 మెయిన్స్‌
ఏపీ జాగ్రఫీపై పట్టు సాధిస్తే గ్రూప్‌-1 మెయిన్స్‌లో 100 మార్కులు సాధించవచ్చు. దీనికి కూడా ప్రధాన ఆధారం 'ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే' అని మరవకూడదు. మొదటి పేపర్లో వ్యాసరచనలో 50 మార్కులూ, మూడో పేపర్లో 50-60 మార్కులు తెచ్చుకోవచ్చు. 150-200 పదాలతో తాజా సమాచారం జోడించి సమగ్రంగా ముందే రూపొందించుకుని చదవాల్సివుంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలపై పట్టు సాధిస్తే ఉద్యోగం మీ సొంతం.
 
చిత్రపటాలే ఆధారం
టీవల గ్రూప్‌-1 ప్రిలిమినరీలో ఒక ప్రశ్నలో ఓ రాష్ట్ర పటాన్ని ఇచ్చి అది ఏ రాష్ట్రమో గుర్తించమని అడిగారు. తరవాత ప్రశ్నలో ఒక జిల్లా పటాన్ని ఇచ్చి అది ఏ జిల్లానో గుర్తించమన్నారు. కాబట్టి భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ పటాలు మీ కళ్లముందు కదలాడుతూ ఉండాలి. భౌగోళిక విస్తీర్ణపరంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలో ఏ స్థానంలో ఉందో గుర్తించాలి. భారతదేశ భూ సరిహద్దు దేశాలను చదివి, ఆ తరవాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలేమిటో తెలుసుకోవాలి. భారతదేశ పర్వతాలను విశ్లేషించి చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పర్వత శ్రేణుల విస్తరణను, వివిధ ప్రాంతాలలో వాటి ప్రాంతీయ నామాలను, వాటి సరాసరి ఎత్తును, అత్యున్నత పర్వత శిఖరం మొదలైనవాటిని ప్రత్యేకించి చదవవలసి ఉంటుంది. భారతదేశ నదులు, వాటి ఉపనదులు చదివేటప్పుడు- ఆంధ్రప్రదేశ్‌లోని నదులు, వాటి ఉపనదులు సమగ్రంగా చదవవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల వార్తల్లోకెక్కిన అంశాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ప్రాణహిత ఏ నదికి ఉపనది అని అడగవచ్చు. పోలవరం ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడుతుంది? మూసీ ఏ నదికి ఉపనది అనో లేదో మూసీ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉందనో అడగవచ్చు.
భారతదేశంలో నేలలు (మృత్తికలు) చదివేటప్పుడు వాటి వర్గీకరణను, విస్తరణను అర్థం చేసుకొని ఆ తరవాత ఆంధ్రప్రదేశ్‌లోని నేలల వర్గీకరణ, విస్తరణ చదవాలి.
* భారతదేశంలో అత్యధికంగా విస్తరించివున్న నేలలు ఏ రకానికి చెందినవి? (ఒండ్రుమట్టి నేలలు).
* ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా విస్తరించియున్న నేలలు? (ఎర్రనేలలు).
ఈ విధంగా ప్రతి అంశాన్నీ మొదట భారతదేశ అంశాలను చదివి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలను చదవాలి. ముఖ్యంగా వ్యవసాయం-పంటల విస్తరణ-ఉత్పత్తి, ఖనిజాలు- విస్తరణ, ముఖ్య పరిశ్రమలు - రవాణా సౌకర్యాలు- సమాచార సాధనాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి.





మార్కుల చుట్టూ భూగోళం!


మార్కుల చుట్టూ భూగోళం!
ఎ.ఎం. రెడ్డి
కెరీర్‌ ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌

ఏపీపీఎస్‌సీ త్వరలో నిర్వహించబోయే అన్ని పోటీ పరీక్షల్లోని జనరల్‌ స్టడీస్‌లో భూగోళశాస్త్రం కీలకమైనది. ముఖ్యంగా గ్రూప్‌-1 మెయిన్స్‌లో, గ్రూప్‌-2లో మార్కుల పరంగా దీనికున్న ప్రాధాన్యం గ్రహించి, తగిన సమయం కేటాయించుకోవాలి; వ్యూహాత్మకంగా అధ్యయనం చేయాలి!
భూగోళశాస్త్రాన్ని (geography)ఇంటర్‌ డిసిప్లినరీ సబ్జెక్టుగా పేర్కొంటారు. అనేక ఇతర సబ్జెక్టులతో దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలుంటాయి కాబట్టే దీనికీ పేరు! ప్రశ్నలు భౌతిక, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి ఉంటాయి. గ్రూప్‌-2... దీని వాటా?
గ్రూప్‌-2 పరీక్షలోని మొదటి పేపర్లో 30 ప్రశ్నలు, మూడో పేపర్‌ భారతదేశ ఆర్థికవ్యవస్థ మూడో విభాగం నుంచి మరో 20-25 ప్రశ్నలు, మూడో పేపర్‌ రెండో విభాగం ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థలోని మూడో యూనిట్‌ నుంచి 20-25 ప్రశ్నలూ వస్తాయి. అంటే గ్రూప్‌-2 పరీక్షలో... భూగోళశాస్త్రం నుంచి 70-75 ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి దీని ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకోవాలి.
గ్రూప్‌-1 మెయిన్స్‌లో కీలకం
గ్రూప్‌-1 మెయిన్స్‌ నాలుగో పేపర్‌లోని మొదటి విభాగం నుంచి 30 మార్కులకు, మూడో విభాగం నుంచి మరో 30-40 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. అంతేకాక భూగోళశాస్త్ర అధ్యయన ఆధారంగా 50 మార్కుల వ్యాసం కూడా వచ్చే అవకాశముంది. ఉదాహరణకు... 1. వాతావరణ మార్పు 2. ఇంధన భద్రత (Energy Security) 3. ఆహార భద్రత- వరదలు- క్షామ పరిస్థితులు మొదలైనవి. ఈ విధమైన వ్యాసరచనకు భూగోళ పరిస్థితుల పరిజ్ఞానం, దాని అన్వయం ఎంతగానో తోడ్పడుతుంది.

ఇతర పరీక్షలన్నిటిలో జనరల్‌స్టడీస్‌ పేపర్‌ నుంచి భూగోళశాస్త్ర ప్రశ్నలు 30 తప్పకుండా ఉంటాయి. మారిన సరళి...
రాబోయే పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే అభ్యర్థులు ముందుగా భూగోళశాస్త్రం నుంచి వచ్చే ప్రశ్నల తీరును తెలుసుకోవాలి. ఇటీవలికాలంలో జరిగిన వివిధ పోటీ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలస్థాయి, సరళిలో వచ్చిన మార్పులను గ్రహించాలి. ప్రశ్నలు గతంలో మాదిరి మూసలో కాకుండా విషయ అవగాహన ఆధారంగా విశ్లేషణాత్మకంగా వస్తున్నాయి. ఉదాహరణకు... ఇటీవల జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు ప్రపంచ భూగోళశాస్త్రంలోని లోతైన అవగాహనను పరీక్షించేవిగా ఉన్నాయి. ముందుగా ఇలాంటి ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఎలా సిద్ధం కావాలో పరిశీలిద్దాం.
మనదేశానికే పరిమితం కాదు
భూగోళశాస్త్రమంటే భారతదేశ భౌగోళిక అంశాలు మాత్రమే కాదు. ప్రశ్నలను పరిశీలిస్తే... గతంలో నాలుగైదు ప్రశ్నలకే పరిమితమైవుండే ప్రపంచ భూగోళశాస్త్రం, భౌతిక భూగోళశాస్త్రాలు ఇప్పుడు 10-12 ప్రశ్నలకు పెరిగాయి. మారిన ఈ ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా భౌతిక భూగోళశాస్త్రం అంటే.. భూస్వరూపశాస్త్రం, శీతోష్ణస్థితి శాస్త్రం, సముద్రశాస్త్రాల్లోని మౌలిక అంశాలను అవగాహన చేసుకుని, వాటి అనువర్తనాలపై పట్టు సాధించాలి.
ప్రపంచ భూగోళశాస్త్ర ప్రాధాన్యం
ఈ సబ్జెక్టు నుంచి వచ్చే మొత్తం ప్రశ్నల్లో దాదాపు సగం ప్రపంచ భూగోళశాస్త్రం నుంచి వస్తాయని గుర్తించండి. (భౌతిక భూగోళశాస్త్రాన్ని దీనిలో భాగంగానే పరిగణించాలి. ఎందుకంటే... భౌతిక భూగోళ మౌలిక భావనలు భూగ్రహానికి సంబంధించినవి.)
ఇటీవలి గ్రూప్‌-1లోని ఈ దిగువ ప్రశ్నలను గమనించండి.
* భూమి వెలుపలి పొరను ఏమని పిలుస్తారు?
* ప్రపంచంలో అతి పెద్ద మహాసముద్రమేది?
* అక్షాంశాలను భూమధ్యరేఖకు సమాంతరంగా ఎటువైపు నుంచి గీస్తారు?
* ప్రతి సంవత్సరం మార్చి 21, సెప్టెంబరు 21న సూర్యుని కిరణాలు దేనిపై నేరుగా ప్రసరిస్తాయి?
ఈ నాలుగు ప్రశ్నలూ భౌతిక భూగోళానికి సంబంధించినవే. కాబట్టి భారతదేశ అంశాలకు పరిమితం కాకుండా భౌతిక భూగోళశాస్త్రంలోని విభాగాలన్నిటిలో ఉన్న మౌలిక భావనలపై పట్టు పెంచుకోవాలి.
పాఠశాల పుస్తకాలే ఆధారం
దీనికోసం మొదట 5,6,7,8,9 తరగతుల పాఠ్యపుస్తకాలను చదివి, తర్వాత ఇంటర్మీడియట్‌ భూగోళశాస్త్ర పాఠ్యపుస్తకాలను చదవాలి. ఆపై డిగ్రీ స్థాయిలో తెలుగు అకాడమీ ఇటీవల ప్రచురించిన భౌతిక భూగోళశాస్త్రాన్ని చదివితే ఈ విభాగంపై పూర్తి పట్టు సాధించవచ్చు. సాధారణంగా ఎగ్జామినర్స్‌ అంతా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు కాబట్టి వారు డిగ్రీ స్థాయిలో ప్రశ్నలను అడిగినప్పటికీ మీరు ఇందులోని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు గుర్తించగలుగుతారు.
ఈ అంశాలను చదివేటప్పుడు వాటికి సంబంధించిన చిత్రపటాలపై (మ్యాపులు) దృష్టిని కేంద్రీకరిస్తే పాఠ్యాంశంపై సమగ్ర అవగాహన ఏర్పడి, మనసులో నాటుకుంటుంది.
వీలైతే 8 నుంచి 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను కూడా చదవగలిగితే ప్రిపరేషన్‌ సమగ్రంగా, సంపూర్ణంగా ఉంటుంది. పరీక్షలో వచ్చే ప్రశ్నలన్నిటికీ కచ్చితమైన సమాధానాలను గుర్తించవచ్చు. ఎందుకంటే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ప్రతి అంశానికీ ప్రామాణిక చిత్రపటం ఉంటుంది. ప్రపంచ భూగోళశాస్త్ర అధ్యయనానికి అట్లాస్‌తో పాటు ఖండాలవారీగా చిత్రపటాలు లభ్యమవుతాయి. వాటిని ముందుంచుకుని చదివితే సబ్జెక్టు ఇంకా తేలిగ్గా అర్థమవటమే కాకుండా మనసులో స్థిరంగా ఉంటుంది.
భారతదేశ భౌగోళికాంశాలు
వీటి నుంచి దాదాపు 10-12 ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్‌ భూగోళశాస్త్రం నుంచి 3-5 ప్రశ్నలూ వస్తాయి. వీటికోసం ముందుగా 8-12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను చదవాలి. ఇంకా 8- 10 తరగతి పాఠ్యపుస్తకాల్లోని ఆంధ్రప్రదేశ్‌, భారతదేశ భౌగోళికాంశాలను చదువుతూ తాజా సమాచారం కోసం ఇండియా ఇయర్‌బుక్‌ను క్షుణ్ణంగా చదవాలి.
సాధారణంగా ఇప్పటివరకూ భారతదేశ శీతోష్ణస్థితి... అంటే ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన అంశాలపై అత్యధిక/ అత్యల్ప వర్షపాతం?- లేదా ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు ఏవి?- అనే ప్రశ్నలుండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నల స్థాయి పెరిగింది. వివిధ రాష్ట్రాల, వార్షిక గరిష్ఠ, కనిష్ఠ వ్యత్యాసం, సగటు ఉష్ణోగ్రతలపై ప్రశ్నలు వస్తున్నాయని గమనించండి.
గోడలకు చిత్రపటాలు
వివిధ రాష్ట్రాల, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల భౌగోళిక ఆకృతులపై ప్రశ్నలు వచ్చాయి. అంటే... రాష్ట్ర చిత్రపటాన్ని కానీ, జిల్లా చిత్రపటాన్ని కానీ ఇచ్చి వాటిని గుర్తించమని ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ముందుగా భారతదేశ చిత్రపటాన్ని ముందుంచుకుని వివిధ రాష్ట్రాల ఆకృతులనూ, వాటి సరిహద్దులనూ గమనించాల్సివుంటుంది. అలాగే మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఆకృతులనూ, వాటి సరిహద్దులనూ కూడా జాగ్రత్తగా గమనించాలి.
మీ స్టడీరూంలో గోడలకు వివిధ చిత్రపటాలను తగిలించి, వీలైనప్పుడల్లా వాటిని పరిశీలిస్తూనే ఉంటే తప్ప ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించలేరు.
ఇంకా ఇతర అంశాలు... పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, నేలలు, అడవులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జీవావరణ కేంద్రాలు, వ్యవసాయ పంటలు, పశుపోషణ, ఖనిజ వనరులు, ఇంధన వనరులు, పరిశ్రమలు, రవాణా, సమాచార సాధనాలు మొదలైనవాటిని అధ్యయనం చేసేటపుడు ప్రతి అంశాన్నీ తాజాసమాచారంతో జోడించాలి.
* ఆంధ్రప్రదేశ్‌లో కేశోరాం సిమెంటు పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది?
* భారతదేశంలో మాంగనీసును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రమేది?
* (ఈ కిందివాటిలో) ఏ నదీ హరివాణం అధిక భూగర్భ జలాల సంభావ్యాన్ని/ శక్మతను కలిగివుంది?
* ఆంధ్రప్రదేశ్‌లో సీసపు నిల్వలు అధికంగా ఉన్న జిల్లా ఏది?
ఇలాంటివి గతంలో మూసగా అడిగిన ప్రశ్నలకు భిన్నంగా ఉన్నాయని గ్రహించి, ప్రిపరేషన్‌ని దీనికి అనుగుణంగా మార్చుకోవాల్సివుంటుంది.
భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలకు సంబంధించి ముందుగా పేర్కొన్నట్టు గ్రూప్‌-2 అభ్యర్థులకు మూడో పేపర్లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ వనరులు, జనాభా శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మొదటి పేపర్లోని భౌగోళికాంశాలకే పరిమితం కాకుండా మూడో పేపర్‌ కోసం విస్తృతంగా చదవాలి.
ముఖ్యంగా త్వరలో 15వ జనగణన జరగనుంది. కాబట్టి మీ పరీక్షలో 14వ జనగణనపై పూర్తి పట్టు సాధిస్తే 15వ జనగణనపై, ఈ రెంటిమధ్య గల వ్యత్యాసాలపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలను గుర్తించగలుగుతారు.
గ్రూప్‌-1 మెయిన్స్‌
గ్రూప్‌-1 మెయిన్స్‌ రాసే అభ్యర్థులు కూడా పైన సూచించిన భౌగోళికాంశాలపై పట్టు సాధిస్తే... వ్యాసరచనలో అవసరమైన చోటు ఉదాహరించటానికి చక్కగా తోడ్పడుతుంది. మెయిన్స్‌ నాలుగో పేపర్‌ మొదటి విభాగంలోని ఇంధన వనరులు... ముఖ్యంగా పునః స్థాపిత ఇంధన వనరులు- అణుశక్తి మొదలైనవి ముఖ్యం. భూగోళశాస్త్ర కోణంలో వాటి ప్రాధాన్యాన్నీ, లభ్యతనూ, పరిణామాలనూ అధ్యయనం చేయాల్సివుంటుంది. వీటి నుంచి వివిధ కోణాల్లో వచ్చే ప్రశ్నలకు 150 పదాల్లో సమగ్ర సమాధానాలను రాయగలిగే రీతిలో నోట్సును సిద్ధం చేసుకోవాల్సివుంటుంది.


తాజా సమాచారమే కీలకం!
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, పంటల విధానం మొదలైనవి కూడా భూగోళశాస్త్రానికి సంబంధించినవే. కానీ వీటికోసం పాఠ్యపుస్తకాల్లో లభించే సమాచారంతో పాటు తాజా సమాచారాన్ని కూడా వార్తాపత్రికల నుంచి సేకరించాలి. తీవ్ర విమర్శలను పక్కకుపెట్టి నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రమే గ్రహించి,నోట్సు తయారుచేసుకోవాలి. గ్రూప్‌-1 మెయిన్స్‌ నాలుగో పేపర్‌ మూడో విభాగంలోని దాదాపు అన్ని అంశాలూ కొంతవరకూ భూగోళశాస్త్ర అధ్యయనంతో ముడిపడివున్నాయి. కాబట్టి వీటిని భౌగోళిక భావనల ఆధారంగా అర్థం చేసుకుని, శాస్త్రీయంగా వాటిని వివరించాల్సివుంటుంది. ఈ అంశాలన్నిటినీ కవర్‌ చేస్తూ వివిధ పత్రికల్లో వచ్చే ప్రత్యేక వ్యాసాలను సేకరించి, మీ పరీక్షకు అనుగుణంగా మార్చుకోవాలి. వాటితో టాపిక్‌కు సంబంధించిన మౌలిక భావాలను జతచేసి నోట్సు సిద్ధం చేసుకోవాలి. దీన్ని శ్రద్ధగా చదివితే గ్రూప్‌-1 మెయిన్స్‌లో సమగ్ర సమాధానాలు రాయగలుగుతారు.
నిజానికి భూగోళశాస్త్రాన్ని అన్ని శాస్త్రాలకూ మాతృక వంటిదని అభివర్ణిస్తారు. అందుకే గ్రూప్‌-1 అభ్యర్థులు మొదట దీనిపై దృష్టి పెడితే పేపర్‌-1తో పాటు పేపర్‌-3లో కొంతవరకూ, పేపర్‌-4లో చాలావరకూ ప్రశ్నలకు సమగ్ర జవాబులు రాయటం సాధ్యమవుతుంది.